Covid-19 Conditions Repeat: మళ్లీ లాక్ డౌన్ వస్తుందా? ప్రధాని మోడీ మాటల్లో అంతరార్ధం ఏమిటి?

Covid-19 Conditions Repeat: మధ్యప్రాచ్య యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ లోక్‌సభలో చేసిన ప్రసంగంపై విశ్లేషణ. చమురు కొరత, ధరల పెరుగుదల , లాక్‌డౌన్ భయాలపై స్పష్టత.

KVD Varma
Published on: 24 March 2026 12:23 PM IST
Covid-19 Conditions Repeat
X

Covid-19 Conditions Repeat: మధ్యప్రాచ్య యుద్ధం నేపథ్యంలో ప్రధాని మోదీ లోక్‌సభలో చేసిన ప్రసంగంపై విశ్లేషణ

Covid-19 Conditions Repeat: మధ్యప్రాచ్యంలో యుద్ధం.. రెండు దేశాల అభిజాత్యం.. మధ్యలో ఒక దేశపు ఆక్రమణల ఆరాటం. వీటి మధ్యలో ప్రంచంలోని దేశాలు నలిగిపోతున్నాయి. ఒక్క హార్మోజ్ జలసంధి ప్రపంచంలోని చాలా దేశాల ఎకానమీని తల్లకిందులు చేసేస్తోంది. ఈ నేపథ్యంలో ఆచి, తూచి జాగ్రత్తగా వ్యవహరించింది భారత్. ఎప్పటికప్పుడు సంక్షోభాలను పరిష్కరిస్తూ వస్తోంది ప్రభుత్వం. అయితే, పరిస్థితులు మరింత దిగజారితే.. ప్రభుత్వం చేతులు కూడా దాటిపోయే విపత్కర కాలం వస్తే.. ఏమవుతుంది? మళ్లీ లాక్ డౌన్ వస్తుందా? ఇప్పుడు ఈ ప్రశ్నలు చాలామందికి వస్తున్నాయి. ఎందుకంటే, సోమవారం ప్రధాని మోదీ తొలిసారిగా బహిరంగంగా యుద్ధం గురించి.. యుద్ధ వేళలో భారత్ పరిస్థితి గురించి మాట్లాడారు. పార్లమెంట్ వేదికగా ప్రధాని మోదీ చాలా అంశాలను ప్రస్తావించారు.

కోవిడ్-19లో అలా..

ఆయన మాటల్లోనే చెప్పాలంటే “ కోవిడ్-19 మహమ్మారి సమయంలో సప్లై చైన్స్ దెబ్బతిన్నప్పటికీ మేము రైతులకు, ప్రజలకు రక్షణ కల్పించాం.” “కోవిడ్-19 సంక్షోభ సమయంలో ప్రపంచ మార్కెట్లు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. యూరియా ధర క్వింటాల్ కు 3,000 రూపాయలకు చేరుకుంది. అప్పుడు కూడా భారత్ లో ఆ ధరలను 300 రూపాయల వద్దే ఉంచాము.”

ఆర్థిక పరిస్థితులు..

ఇవీ సంక్షోభాన్ని.. సంక్షోభ సమయంలో భారత్ వ్యవహరించిన తీరును చెబుతూ ప్రధాని అన్న మాటలు. అయితే, అంతర్లీనంగా ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయని ఆయన చెప్పారు. కోవిడ్ ఎలాగైతే దీర్ఘకాలిక సమస్యలను తీసుకు వచ్చిందో.. ఇప్పుడు మధ్య ప్రాచ్యంలో యుద్ధం కారణంగా అలాంటి పరిస్థితులే వచ్చే అవకాశం ఉందని ప్రజలను అప్రమత్తం చేయడమే ఆయన ఉద్దేశ్యం కావచ్చు. ఎందుకంటే, ప్రపంచ మార్కెట్లు కుదేలు అయ్యే పరిస్థితుల్లో ఆ ప్రభావం మన దేశం మీద కూడా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం చాలా ఎక్కువ. సరిగ్గా ఇవే పరిస్థితులు కోవిడ్ సమయంలోనూ తలెత్తాయి. వాటిని ప్రజలంతా ఐక్యంగా ఎదుర్కొన్నారు. ప్రభుత్వానికి సహకరించారు. ఇప్పుడు కూడా మహమ్మారి లాంటి పరిస్థితులు తరుముకు వస్తున్న వేళలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనేదే ప్రధాని సూచనగా చెప్పుకోవచ్చు.

యుద్ధ ప్రభావం..

ప్రధాని మోడీ పదే పదే తన ప్రసంగంలో కోవిడ్ ప్రస్తావన తెచ్చారు. ఇప్పటి తరానికి కోవిడ్ పరిస్థితుల్లో ఎదురైనా సంక్షోభమే అతి పెద్దది. ఆ కారణంగానే అందరికీ అర్ధమయ్యే రీతిలో ఆయన కోవిడ్ పరిస్థితులను ఊటంకించి ఉంటారు. సాధారణంగా యుద్ధ కారణంగా వచ్చే కష్టాలు మన దేశంలో ఇప్పటి తరానికి ప్రత్యక్షంగా తెలియవు. ఒక పక్క ధరలు పెరిగిపోవడం.. మరోపక్క నిత్యావసరాల లభ్యత తగ్గిపోవడం.. ఇంకోపక్క ఆదాయ వనరులు క్షీణించడం లాంటి సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంటుంది. అలాంటపుడు ఎలా వ్యవహరించాలో.. ప్రజలు భయావహులు కాకుండా చూడడడం కోసం.. అలంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి అందరూ సన్నద్ధులై ఉండాలనేదే ప్రధాని ప్రసంగంలోని అంతరార్దంగా భావించవచ్చు. ఇదే సందర్భంలో ఆయన కోవిడ్ పరిస్థితులను ఎంత సమర్ధంగా ప్రభుత్వం ఎదుర్కుందో . . అదే సన్నద్ధతతో ఇప్పుడు కూడా ప్రభుత్వం ఉందని ఆయన తన మాటల్లో స్పష్టం చేశారు. సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అన్నిరకాలుగానూ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తోందని ఈ సందర్భంగా ప్రధాని చెప్పారు.

మళ్ళీ లాక్ డౌన్?

ఇక లాక్ డౌన్ అనేది ఈ పరిస్థితుల్లో వచ్చే సూచనలు అయితే లేవు. కానీ, యుద్ధం మరింత ముదిరితే ఆ ప్రకటిత లాక్ డౌన్ రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే, పెట్రోల్ దొరకదు. దొరికినా సామాన్యునికి అందుబాటులో ఉండదు. ధరలు ఆకాశాన్నంటుతాయి. ఆ మాత్రం ఈ మాత్రం సంపాదనతో బ్రతికేవారికి జీవనం కష్టం అయిపోతుంది. ప్రాజెక్టులు నిలిచిపోతాయి. నిరుద్యోగం పెరిగిపోతుంది. ఇంకా ఇలాంటి సంక్షోభాలు ఎన్నో వస్తాయి. వీటన్నిటికీ సిద్ధ పడి ఉండడం కచ్చితంగా అవసరమే. ఇప్పుడు మళ్ళీ కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంత జాగ్రత్తగా.. ఎంత ఐక్యంగా వ్యవహరించామో అదే విధంగా అందరూ ఉండాల్సిన అవసరం ఉందనేది మాత్రం నిజం.

KVD Varma

KVD Varma

జర్నలిజం రంగంలో 18 ఏళ్ల సుదీర్ఘ అనుభవం నాది. 2008లో సాక్షి పత్రికలో రిపోర్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ఆపై వివిధ పత్రికల్లో రిపోర్టర్ గా, బ్యూరో చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించాను. డిజిటల్ విప్లవంతో ఇటువైపు ప్రయాణంలో భాగంగా HMTVతో ప్రారంభించి TV9, RTV, Mahaa News వంటి అగ్రగామి సంస్థల్లో డిజిటల్ జర్నలిస్టుగా పనిచేశాను. ప్రస్తుతం HMTV వెబ్‌సైట్ వేదికగా పాఠకులకు తాజా వార్తలను అందిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తూ.. హిందీ, ఇంగ్లీష్ వార్తలను తెలుగు పాఠకుల అభిరుచికి అనుగుణంగా అనువదించి, విశ్లేషణాత్మక కథనాలను అందించడం నా ప్రత్యేకత.

Next Story