Rajendra Prasad: నువ్వు ఇక మారవా..? ఎంజీఆర్‌పై రాజేంద్రప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు

Rajendra Prasad: నటకిరీటి రాజేంద్రప్రసాద్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. లెజెండరీ నటుడు కాంతారావు గొప్పతనాన్ని చెప్పే క్రమంలో ఎంజీఆర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Naresh.k
Published on: 11 March 2026 8:51 AM IST
Rajendra Prasad
X

Rajendra Prasad: నువ్వు ఇక మారవా..? ఎంజీఆర్‌పై రాజేంద్రప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు

Rajendra Prasad: తెలుగు సినీ తెరపై నవ్వుల పూలు పూయించిన 'నటకిరీటి' రాజేంద్రప్రసాద్ ఇప్పుడు వరుస వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నారు. నిన్నటి వరకు డేవిడ్ వార్నర్, బ్రహ్మానందం, అలీ వంటి వారిపై చేసిన వ్యాఖ్యలు ఒకెత్తయితే.. తాజాగా తమిళ సినీ దిగ్గజం, మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు రాష్ట్రాల సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.

అసలేం జరిగింది?

భారత్ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో రాజేంద్రప్రసాద్‌కు ‘కళాప్రపూర్ణ కత్తి కాంతారావు జాతీయ పురస్కారం’ ప్రదానం చేశారు. ఈ వేదికపై మాట్లాడుతూ, లెజెండరీ నటుడు కాంతారావు గారి గొప్పతనాన్ని వివరించే క్రమంలో.. కాంతారావుని చూసి ఎంజీఆర్ భయపడిపోయేవారు అంటూ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ఆయన ఉపయోగించిన కొన్ని పదాలు ఇప్పుడు వివాదానికి కారణమయ్యాయి.

వివాదాల రాబిన్‌హుడ్

రాజేంద్రప్రసాద్ ఇలా నోరు జారడం ఇది మొదటిసారేమీ కాదు. గత కొద్దికాలంగా ఆయన ఏ వేదికపై మాట్లాడినా అది వివాదంగా మారుతోంది. రాబిన్‌హుడ్ ఈవెంట్‌లో వార్నర్‌పై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి.బ్రహ్మానందం & అలీ వంటి తోటి నటులను ఉద్దేశించి సరదాగా అన్న మాటలు కూడా అనుచిత పదజాలం వల్ల విమర్శలకు గురయ్యాయి.ఇకపై నోరు అదుపులో పెట్టుకుంటాను" అని గతంలో ఆయనే స్వయంగా చెప్పినప్పటికీ, తాజా ఘటన చూస్తుంటే ఆయన తీరు మారలేదని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక లెజెండరీ నటుడిని పొగిడే క్రమంలో మరో లెజెండరీ నటుడిని తక్కువ చేసి మాట్లాడటం సంస్కారం అనిపించుకోదు. అని కొందరు విమర్శిస్తుంటే..ఆయన సరదాగా అన్న మాటలను కావాలనే ట్రోల్ చేస్తున్నారు, ఆయన ఉద్దేశం కాంతారావు గొప్పతనాన్ని చెప్పడమే కానీ ఎంజీఆర్‌ని తక్కువ చేయడం కాదు అని అభిమానులు వెనకేసుకొస్తున్నారు.

ఏది ఏమైనా, రాజేంద్రప్రసాద్ లాంటి సీనియర్ నటులు పబ్లిక్ వేదికలపై మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఒకరిని గౌరవించే క్రమంలో మరొకరిని కించపరిచినట్లు అనిపిస్తే, అది చివరకు వ్యక్తిగత ప్రతిష్టకే కాకుండా ఇండస్ట్రీ గౌరవానికి కూడా భంగం కలిగించే ప్రమాదం ఉంది.




Naresh.k

Naresh.k

Next Story