Kadapa POCSO court: ఫోక్సో కేసులో సంచలన తీర్పు.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
Kadapa POCSO court: బాలికను మాయమాటలతో మోసగించిన ఘటనలో నేరం రుజువు కావడంతో కడప కోర్టు నిందితునికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది
Kadapa POCSO court
Kadapa POCSO court: మైనర్ బాలికను మోసగించి బలవంతంగా పెళ్లి చేసుకున్న కేసులో కడప పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితునికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ వెంకటేశ్వర రావు బుధవారం వెల్లడించారు.
జమ్మలమడుగు మండలం సుగుమంచిపల్లె చెందిన మహమ్మద్ భాష అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి మోసం చేసినట్లు డీఎస్పీ తెలిపారు. బాలికను జమ్మలమడుగు శివారులోని హంసలకోనలో పసుపు తాడు కట్టి, శారీరకంగా పలుమార్లు అనుభవించినట్లు చెప్పారు. అక్కడినుంచి అనంతపురం తీసుకువెళ్లి బిందెల ఫ్యాక్టరీ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని బాలికతో బలవంతంగా కాపురం పెట్టాడు. బాధితురాలి తల్లితండ్రుల పిర్యాదు మేరకు అప్పటి జమ్మలమడుగు డిఎస్పి నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
మైనర్ బాలికను నిందితుడు మహమ్మద్ భాష బలవంతంగా పెళ్లి చేసుకుని.. అత్యాచారం చేసినట్టు దర్యాప్తులో తేలడంతో నిందితుడిని అరెస్టు చేసి కడప ఫోక్సో కోర్టులో చార్జి సీటు దాఖలు చేశారు. స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొమ్మినేని వేణుగోపాల్ ప్రాసిక్యూషన్ తరపున వాదనలు వినిపించారు. జడ్జి కేశవ సాక్షులను విచారించి నేరం రుజువు కావడంతో నిందితుడు మహమ్మద్ భాషా కు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, ఐదువేల రూపాయల జరిమానా విధించారు. ఈ కేసులో బాధితురాలికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వవలసిందిగా కడప కలెక్టర్ ను కోర్టు ఆదేశించినట్లు డీఎస్పీ వెంకటేశ్వర రావు మీడియా సమావేశంలో తెలిపారు.




