Coimbatore Accident: అతివేగంతో ప్రాణాలు పోగొట్టుకున్న ఐటీ ఉద్యోగిని

Coimbatore Accident: అతివేగం, పైగా నిద్ర మత్తు ఒక ఐటీ ఉద్యోగిని, ఆమె అత్త ప్రాణాలను బలిగొంది. మరో ముగ్గురు తీవ్రగాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.

KVD Varma
Published on: 22 March 2026 7:16 PM IST
Coimbatore Accident: అతివేగం, పైగా నిద్ర మత్తు ఒక ఐటీ ఉద్యోగిని, ఆమె అత్త ప్రాణాలను బలిగొంది.
X

Coimbatore Accident

Coimbatore Accident: ఒక ఐటీ మహిళా ఉద్యోగిని గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి చెన్నై నుంచి కోయంబత్తూరుకు రెగ్యులర్ రూట్ కాకుండా వేరే రూట్ లో ప్రయాణించింది. ఆమె తన కారును అతివేగంగా నడుపుతూ ఒక చెట్టును ఢీకొట్టి తీవ్రంగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమెతో పాటు కారు ముందు సీటులో ఉన్న ఆమె అత్తగారు ఇద్దరూ మరణించారు. ప్రమాదం జరిగిన ఈ కారు నుంచి భారీ మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

వెంకటేష్ కోయంబత్తూరు వాసి, చెన్నైలోని యెస్ బ్యాంక్‌లో పనిచేస్తాడు. అతని భార్య, 28 ఏళ్ల ఉపాసన, ఐటీ రంగంలో పనిచేస్తుంది. ఉపాసనకు చెన్నై నుంచి కోయంబత్తూరుకు బదిలీ అయింది. దీంతో ఆమె ఇంటి సామాన్లను ఒక వ్యాన్‌లో ఎక్కించి తన సొంత ఊరికి పంపించింది. ఆ తర్వాత తెల్లవారుజామున తన కారులో సొంత ఊరికి బయలుదేరింది.

ఉపాసన గూగుల్ మ్యాప్స్ సహాయంతో కారు నడిపింది. మామూలుగా వెళ్లే ఉలందూరుపేట బైపాస్ రోడ్డులో కాకుండా, గూగుల్ మ్యాప్స్ చూపించిన విధంగా ఆమె చిన్నసాలెం మీదుగా కారు నడిపింది. తెల్లవారుజాము కావడంతో, ఉపాసన కారును చాలా వేగంగా నడిపింది. ఉపాసన కారు నడుపుతున్నప్పుడు, ఆమె భర్త, అత్తగారు, కొడుకు ఆకాష్, అతని బంధువు శివకుమార్ కారులో గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో ఉపాసన కూడా నిద్రలోకి జారుకుంది.

చెట్టును ఢీకొని..

కారు దత్తతిరుపురం ప్రాంతం సమీపానికి వచ్చినప్పుడు ఉపాసన నిద్ర మత్తులో ఒక లారీని ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించింది. అప్పుడు, అనుకోకుండా, కారు రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లి బోల్తా పడి ఒక చెట్టును ఢీకొట్టింది. దీంతో కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారు నడుపుతున్న ఉపాసన, ముందు సీట్లో కూర్చున్న ఆమె అత్తగారు ఇద్దరూ విషాదకరంగా మరణించారు. ప్రమాద తీవ్రత ఎంతలా ఉందంటే.. కారు నుజ్జు, నుజ్జు అయిపోగా ఈ ప్రమాదంలో, ఉపాసన తల మొండెం నుండి వేరు పడి పూర్తిగా విచ్ఛిన్నమైంది.

కారు వెనుక సీటులో కూర్చున్న ఉపాసన భర్త, కుమారుడు, బంధువు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. ప్రమాద స్థలంలో కారు నుంచి కిందపడిపోయిన తర్వాత వారు అంబులెన్స్ సిబ్బందికి డబ్బులు అప్పగించారని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో అదే ట్విస్ట్ గా మారింది. దొరికిన నగదు ఎంత అనేది బయటకు తెలియలేదు కానీ, పెద్ద మొత్తంలోనే ఉండొచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, ఎన్నికల సమయంలో వాహన తనిఖీకి చిక్కకుండా ఉండేందుకు వారు తెల్లవారుజామున వేరే మార్గంలో ప్రయాణించి ఉండవచ్చనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

KVD Varma

KVD Varma

Next Story