YS Sharmila: నిజం దేవుడికి తెలుసు.. జగన్ కుక్కలతో మొరిగిస్తున్నాడు!

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ కలహాలు మరోసారి ముదిరాయి.

Arun Chilukuri
Published on: 23 March 2026 4:41 PM IST
YS Sharmila
X

YS Sharmila: నిజం దేవుడికి తెలుసు.. జగన్ కుక్కలతో మొరిగిస్తున్నాడు!

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ కుటుంబ కలహాలు మరోసారి ముదిరాయి. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి వైసీపీపై, తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డిపై విమర్శల జడివాన కురిపించారు. ముఖ్యంగా వివేకా హత్య కేసు మరియు వైఎస్ విజయమ్మ రాసిన లేఖపై ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

వివేకా హత్యపై 'గుండెపోటు' కట్టుకథ!

వివేకా హత్య కేసును తప్పుదారి పట్టించింది అవినాష్ రెడ్డేనని షర్మిల మరోసారి నొక్కి చెప్పారు. "వివేకా గారికి గుండెపోటు వచ్చిందన్న కట్టుకథ అవినాష్ రెడ్డి సృష్టే. ఆ నిజాన్ని నేను ప్రెస్ మీట్‌లో చెబితే.. వైసీపీ వాళ్లు ఆస్తుల గురించి మాట్లాడుతున్నారు. వివేకా హత్యపై సమాధానం చెప్పే దమ్ము జగన్‌కు లేదు" అని ఆమె ధ్వజమెత్తారు. ఉదయం 7 గంటల నుంచే సాక్షిలో గుండెపోటు అని ఎందుకు నడిపారో జగన్, భారతి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తన తల్లి వైఎస్ విజయమ్మ రాసిన లేఖ నిజమైనదేనని షర్మిల స్పష్టం చేశారు. "YSR లో సగం విజయమ్మ. ఆస్తులు సగభాగం పంచాలని, నలుగురు మనవళ్లకు సమానంగా ఇవ్వాలని వైఎస్ఆర్ ఆదేశించినట్లు ఆమె లేఖలో స్పష్టంగా చెప్పారు. ఆ లేఖ అబద్ధమైతే జగన్ తన సాక్షి రిపోర్టర్లను పంపి బైట్ తీసుకునేవాడు కదా? అలా చేయలేదంటే అది నిజమే అని అర్థం" అని షర్మిల విశ్లేషించారు.

లేఖపై సమాధానం చెప్పలేక జగన్ కుక్కలతో మొరిగిస్తున్నాడని, ఆయన పూర్తిగా విశ్వసనీయత కోల్పోయారని మండిపడ్డారు. తను చంద్రబాబు చేతిలో కీలుబొమ్మను కాదని, రాజకీయం కోసం ఎవరితోనూ దత్తపుత్రునిగా మారలేదని షర్మిల స్పష్టం చేశారు. "ఆస్తులే ముఖ్యమైతే నేను తెలంగాణలో పార్టీ పెట్టేదాన్ని కాదు. ఆస్తుల కోసం కోర్టుకు వెళ్లింది నేను కాదు. వేరే వాళ్ల ఆస్తులు అనుభవించాల్సిన దౌర్భాగ్యం నాకు పట్టలేదు" అని ఆమె తేల్చి చెప్పారు. వైఎస్ఆర్ ఆశయాల కోసమే తాను నడుస్తున్నానని, సత్యమేవ జయతే అని బోర్డు పెట్టుకుని సాక్షిలో అబద్ధాలు ప్రచారం చేయడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story