నంద్యాలలో ముగ్గురు సెక్యూరిటీ గార్డుల ఆత్మహత్యాయత్నం.. కలకలం రేపుతున్న సెల్ఫీ వీడియో!
నంద్యాల జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమ సమస్యలు పరిష్కారం కావడం లేదన్న ఆవేదనతో ముగ్గురు సెక్యూరిటీ గార్డులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
నంద్యాలలో ముగ్గురు సెక్యూరిటీ గార్డుల ఆత్మహత్యాయత్నం.. కలకలం రేపుతున్న సెల్ఫీ వీడియో!
నంద్యాల: నంద్యాల జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తమ సమస్యలు పరిష్కారం కావడం లేదన్న ఆవేదనతో ముగ్గురు సెక్యూరిటీ గార్డులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆత్మహత్యకు ముందు వారు తీసుకున్న 'సెల్ఫీ వీడియో' ఇప్పుడు స్థానికంగా పెద్ద సంచలనంగా మారింది.
5 నెలలుగా జీతాలు లేవు.. విధుల్లోకి తీసుకోవడం లేదు!
నంద్యాల సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు గత ఐదు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి తోడు, తమను తిరిగి విధుల్లోకి చేర్చుకోకుండా అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని వారు ఆరోపించారు. తమ గోడును వెళ్లబోసుకునేందుకు మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను కూడా కలిసినట్లు సమాచారం. అయినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి ఒడిగట్టారు.
ఆసుపత్రిలో చికిత్స.. పరిస్థితి విషమం
పురుగుల మందు తాగిన ముగ్గురు సెక్యూరిటీ గార్డుల పరిస్థితి విషమించడంతో వారిని వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర విభాగంలో చికిత్స అందుతోంది. సెల్ఫీ వీడియోలో తమ చావుకు అధికారుల వేధింపులే కారణమని వారు పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆసుపత్రి ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.




