కోస్తా, రాయలసీమకు వర్ష సూచన..అప్రమత్తంగా ఉండాలని అధికారుల ఆదేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రెండు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 20 March 2026 7:16 PM IST
Weather Update
X

కోస్తా, రాయలసీమకు వర్ష సూచన..అప్రమత్తంగా ఉండాలని అధికారుల ఆదేశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉత్తరాంధ్ర తీరప్రాంతం మరియు పశ్చిమమధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, కర్ణాటక–తమిళనాడు మీదుగా కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రాబోయే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో పిడుగులు పడే ముప్పు ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

రేపు వర్ష సూచన ఉన్న జిల్లాలు:

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రాయలసీమలోని అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా వర్ష ప్రభావం ఉండనుంది. పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు కురిసే సూచనలు ఉన్నాయి.

ఎల్లుండి కూడా కొనసాగనున్న ప్రభావం:

ఎల్లుండి ముఖ్యంగా విజయనగరం, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

రైతులకు, సామాన్య ప్రజలకు కీలక సూచనలు:

పిడుగుల ముప్పు ఎక్కువగా ఉన్నందున విపత్తుల నిర్వహణ సంస్థ ఈ క్రింది జాగ్రత్తలు సూచించింది:

రైతులు: ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో పొలాల్లో ఉండకూడదు. పశువులను, గొర్రెలను సురక్షితమైన షెడ్లలోకి తరలించాలి.

ప్రజలు: వర్షం పడే సమయంలో చెట్ల క్రింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకూడదు. బహిరంగ ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

అప్రమత్తత: వాతావరణ మార్పులను గమనిస్తూ అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే శ్రేయస్కరం.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story