యువతి చావుకు కారణమైన లోన్ యాప్

Arun Chilukuri
Published on: 17 Dec 2020 1:30 PM IST
యువతి చావుకు కారణమైన లోన్ యాప్
X

పేదలకు లోన్ల పేరుతో వల వేస్తారు అల్లి బుల్లి కబుర్లతో ముగ్గులోకి లాగుతారు. వాళ్ల అవసరాలను ఆసరాగా మార్చుకొని లోన్‌ అంటగడతారు. సామాన్యుల కష్టాన్ని క్యాష్ చేసుకుంటారు. తీరా సరైన సమయంలో వాయిదాలు చెల్లించలేదా..? ఇక అంతే సంగతులు రుణం తీసుకున్న వ్యక్తికి సంబంధించిన స్నేహితులు, బంధువులకు ఒకటే కాల్స్‌, మెసేజ్‌లు స్పందించకపోతే ప్రొఫైల్‌ మొత్తాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి తీవ్ర మనోవేదనకు గురిచేస్తారు. ఇది ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ నిర్వాకుల తీరు.

తాజాగా ఆన్‌లైన్‌ యాప్‌ నిర్వాహకుల అత్యుత్సాహానికి ఓ యువతి బలైపోయింది. సిద్దిపేట జిల్లా రాజగోపాలపేటకు చెందిన మౌనిక ఏఈవోగా విధులు నిర్వహిస్తోంది. కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగోలేక స్నాప్‌ ఇట్‌ లోన్‌ యాప్‌ నుంచి 3 లక్షల రుణం తీసుకుంది. సరైన సమయంలో వాయిదాలు చెల్లించకపోవడంతో యాప్‌ నిర్వాహకులు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. అంతటితో ఆగకుండా డిఫాల్టర్‌గా గుర్తించి ఆమె ఫోన్‌లోని కాంటాక్టు నంబర్లతో పాటు, వాట్సాప్‌ గ్రూపులలో మౌనిక ఫొటోతో పాటు, మొబైల్‌ నెంబర్‌, ప్రొఫైల్‌ను పోస్ట్ చేశారు.

యాప్‌ నిర్వాహకుల నిర్వాకంతో మనస్థాపానికి గురైన మౌనిక ఈ నెల 14న పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే పరిస్థితి విషమించడంతో బాధితురాలిని హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. దీంతో గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మౌనిక బుధవారం ఉదయం మృతి చెందింది. తమ కూతురు మృతికి యాప్‌ నిర్వాహకులే కారణమంటూ సిద్దిపేట వన్‌టౌన్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు తల్లిదండ్రులు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు చర్యలు చేపట్టాలని మృతురాలి బంధువులు కోరుతున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story