హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ ఎందుకు ఓడింది.. ఆ గ్రూపు గొడవలే దెబ్బతీశాయా?

Arun Chilukuri
Published on: 24 Oct 2019 5:08 PM IST
హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ ఎందుకు ఓడింది.. ఆ గ్రూపు గొడవలే దెబ్బతీశాయా?
X

హుజూర్‌నగర్ కాంగ్రెస్‌ కంచుకోట. మొన్నటి ఎన్నికల్లో కారు స్పీడ్‌కు నల్లగొండలో కాంగ్రెస్‌ కకావికలం అవగా హుజూర్‌నగర్‌లో మాత్రం ఎదురు నిలిచి గెలిచారు. కానీ ఉపఎన్నిక సమయానికి హస్తం అస్తవ్యస్తం అయింది. కంచుకోటలాంటి స్థానంలో కాంగ్రెస్‌ ఎందుకు ఓడిపోయింది? గత ఎన్నికల్లో గెలిచిన ఆ పార్టీ ఈసారి ఆ సీటును ఎందుకు కాపాడుకోలేకపోయింది? పార్టీలో అంతర్గత విభేదాలా? సమన్వయలోపమా? నేతల తీరా? వ్యూహాత్మక తప్పిదాలా? వ్యూహరచనలో లోపాలా?

కంచుకోటలో చేతి రేఖలు ఎందుకు మారాయి?

గెలిచే చోట ఎందుకిలా చతికిలపడింది?

హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ ఎందుకు ఓడింది?

ఉన్న సీటును ఎందుకు కాపాడుకోలేకపోయింది?

అంతర్గత విబేధాలా... వ్యూహాత్మక తప్పిదాలా?

ఎన్నికల షెడ్యూల్ మొదలుకుని పోలింగ్ వరకూ ఇలా ఎలక్షనీరింగ్‌లో కాంగ్రెస్‌ విఫలమైందనే ఆరోపణలున్నాయ్‌. కంచుకోటలో విజయం లాంఛనమేనన్న అతి విశ్వాసమే హస్తం పార్టీ కొంపముంచిందనే విమర్శులున్నాయ్‌. దీనికితోడు గ్రూపు గొడవలు మరోసారి దెబ్బతీశాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా ఆర్టీసీ సమ్మె, టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై విమర్శలను సొమ్ము చేసుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమయ్యామని కొందరు సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ సిట్టింగ్‌ స్థానాన్నే చేజార్చుకోవడంపై కాంగ్రెస్‌లో అంతర్మథనం మొదలైంది.

హుజూర్‌నగర్ ఉపఎన్నికకు ఎన్నికల సంఘం నగారా మోగించడమే తరువాయి కాంగ్రెస్ తరఫున టికెట్ విషయంలో ఎంపీ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు కలకలం రేపాయి. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌ సతీమణి పద్మావతికి టికెట్‌ ఇవ్వాలని ఏకపక్షంగా ఎలా నిర్ణయిస్తారంటూ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాను రేవంత్‌ ప్రశ్నించారు. స్థానికురాలు శ్యామల కిరణ్‌రెడ్డికి ఆ టికెట్‌ ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో చిచ్చురేపాయి. సీనియర్లంతా ఒక్కొక్కరుగా ఉత్తమ్‌కు మద్దతు ఇచ్చారు. రేవంత్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రేవంత్ దిగివచ్చి పద్మావతిని గెలిపించుకుంటామన్నారు. అయితే, ఉత్తమ్, రేవంత్ వర్గ పోరు ఎన్నికలపై బాగానే పడింది. ఆ గ్రూపు గొడవలే మరోసారి కాంగ్రెస్‌ను దెబ్బతీశాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

ఉప ఎన్నికలో తన అభ్యర్థి కిరణ్‌రెడ్డి అంటూ రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోమటిరెడ్డి మండిపడ్డారు. ఉత్తమ్‌, జానా, నేను ఏకమయ్యామని, ఉత్తమ్‌ పద్మావతిని నిలబెట్టి గెలిపిస్తాం అంటూ కోమటిరెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్‌ రాజకీయం ఆసక్తికరంగా మారింది. గంటల వ్యవధిలో కాంగ్రె‌స్ కీలక నేతలు విరుద్ధమైన ప్రకటనలు కాక రేపాయి. అదీకాక ఆర్టీసీ సమ్మె, టీఆర్‌ఎస్‌ సర్కార్‌పై విమర్శలను సొమ్ము చేసుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైందని.. సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story