సైలెంట్‌గా వున్న డీకే అరుణ సడెన్‌గా స్పీడెందుకు పెంచారు.. కారణం అదేనా?

సైలెంట్‌గా వున్న డీకే అరుణ సడెన్‌గా స్పీడెందుకు పెంచారు.. కారణం అదేనా?
x
డీకే అరుణ
Highlights

మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో పని చేసిన ఆ మహిళా నాయకురాలు, బీజేపీలో చేరిన తరువాత, సైలెంట్‌గానే ఉంటూ వచ్చారు. అయితే, ఒక్కసారిగా...

మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో పని చేసిన ఆ మహిళా నాయకురాలు, బీజేపీలో చేరిన తరువాత, సైలెంట్‌గానే ఉంటూ వచ్చారు. అయితే, ఒక్కసారిగా యాక్టివ్ అయిన సదరు లీడర్, మహిళా సమస్యలపై పోరుబాట పట్టారు. ఇన్నాళ్లు మౌనంగా ఉన్న ఆమె, ఒక్కసారిగా యాక్టివ్ కావడానికి కారణాలేంటన్న చర్చ, పార్టీలో జోరుగా సాగుతోంది.

ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన డీకే అరుణ, రాష్ట్ర విభజన తర్వాత మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీజేపీలో చేరారు. అయితే పార్టీలో చేరిన తరువాత మహబూబ్ నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసిన ఆమె, ఓటమి పాలయ్యారు. ఆ తరువాత పార్టీలో పెద్దగా యాక్టివ్‌గా లేని అరుణ, దిశ ఘటన తరువాత మహిళా సమస్యలపై పోరు బాట పట్టి ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. దిశ కుటుంబ సభ్యులను పరామర్శించడమే కాకుండా, కోమరంభీమ్ అసిఫాబాద్ జిల్లాలో అత్యాచారం, హత్యకు గురైన సమత కుటుంబాన్ని మహిళా మోర్చా నాయకురాళ్లతో కలిసి పరామర్శించారు. దిశ, సమత, మానస హత్యలకు మద్యమే ప్రధాన కారణమన్న ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో, మహిళా మోర్చా ఆధ్వర్యంలో మద్యానికి వ్యతిరేకంగా దీక్ష చేశారు.

సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో దిశ ఘటనను ఖండిస్తూ మహిళలపై పెరుగుతున్న నేరాలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు డీకే అరుణ. తరువాత మద్యపానాన్ని నిషేధిచాలంటూ డీకే రెండు రోజుల నిరాహారదీక్షతో వార్తల్లో నిలిచారు. ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించి అందరి దృష్టినీ ఆకర్షించారు. అయితే, నిన్నమొన్నటి వరకు సైలెంట్‌గా ఉన్న అరుణ ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిచడం వెనుక అసలు మతలబు ఏంటన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది.

పార్టీలో ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు జరుగుతున్న వేళ అటు పార్టీకి కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరగబోతోంది. ఈ సందర్భంలో అరుణ పార్టీలో యాక్టవ్ రోల్ పోషించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రస్తుతం రేసులో ఉన్న వారిలో లక్ష్మణ్ తరువాత అరుణ పేరే ప్రధానంగా వినిపిస్తోంది. ఆ స్థాయిలో అరుణ లాబీయింగ్ నిర్వహిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే అందరి దృష్టినీ తనవైపు తిప్పుకునేందుకే, హైదరాబాద్‌ కేంద్రంగా అరుణ ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారన్న మాటలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ లక్ష్మణ్‌కు అధ్యక్ష ప‌ద‌విని రెన్యువల్ చేయ‌వ‌ద్దని అధిష్టానం భావిస్తే, అధ్యక్ష పీఠం డీకే అరుణకే దక్కనుందన్న చర్చ నడుస్తోంది. అధిష్టాన పెద్దల దృష్టిని ఆకర్షించడానికే డీకే అరుణ మహిళా సమస్యలపై పోరుబాట పట్టారన్న గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. తాను మహిళా నాయకురాలు కావడం, బలమైన సామాజిక నేపథ్యం, టిఆర్‌ఎస్ ప్రభుత్వంపై దూకుడుగా ముందుకు వెళ్ళడం కలిసొస్తాయని భావిస్తున్నారట అరుణ. ఇక ప్రభుత్వంపై రాజీలేని పోరాటానికి తాను సిద్ధంగా ఉన్నానన్న ఓ మెసేజ్ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం అరుణ చేశారని అంటున్నారు. మరి ఆమె ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందన్నది వేచిచూడాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories