Warangal: ఆదాయానికి మించిన ఆస్తులు.. వరంగల్ డీటీసీ అరెస్ట్

Dhivi
Updated on: 8 Feb 2025 9:00 AM IST
Warangal: ఆదాయానికి మించిన ఆస్తులు.. వరంగల్ డీటీసీ అరెస్ట్
X

Warangal: ఉమ్మడి వరంగల్ జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ ఇళ్లో ఏసీబీ అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించి ఆదాయానికి మంచిన ఆస్తులు ఉన్నాయని గుర్తించి అరెస్టు చేశారు. హన్మకొండ పలివేల్పుల రహదారిలోని దుర్గాకాలనీలో ఉంటున్న శ్రీనివాస్ ఇంటికి ఉదయం 9గంటలకు చేరుకున్న అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆదాయ పత్రాలు, దస్తావేజులు, స్థిర, చరాస్తులకు సంబంధించి విలువైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్ స్వస్థలమైన జగిత్యాలతోపాటు హైదరాబాద్ లోని ఆయన నివాసంలోనూ ఏకకాలంలో సోదాలను నిర్వహించారు. సుమారు 10 గంటలపాటు ఆయనను విచారించారు. ఇంట్లోని పలు దస్తావేజులు పరిశీలించిన తర్వాత హసన్ పర్తి మండలం చింతగట్టు క్యాంపులోని జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి తీసుకుని వచ్చి పలు అంశాలపై సమాచారాన్ని సేకరించారు. అనంతరం తిరిగి ఆయనను ఇంటికి తీసుకెళ్లారు. శుక్రవారం అర్థరాత్రి వరకు సోదాలు కొనసాగాయి.

అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రూ. 4.04 కోట్ల అక్రమాస్తులను గుర్తించారు. దీనిలో ఐదు వేర్వేరు ప్రాంతాల్లో 15ఎకరాల వ్యవసాయ భూమితోపాటు 16ఓపెన్ ప్లాట్లు కూడా ఉన్నాయి.దీంతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి పుప్పాల శ్రీనివాస్ ను అరెస్టు చేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఉమ్మడి వరంగల్ డీటీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆయన అంతకుముందు హైదరాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో పనిచేశారు.

Dhivi

Dhivi

Next Story