Siddipet: ఊరు ఊరంతా కన్నీరు మయం.. కారణం ఇదే!

Siddipet: ఆ పల్లెళ్లన్నీ కన్నీరు పెడుతున్నాయి. ఆ పల్లె ప్రజల గుండెలు చెరువవుతన్నాయి. కన్నతల్లి లాంటి పుట్టిన ఊరిని వదలలేక గ్రామంతో ఉన్న అనుబంధాన్ని తెంపుకోలేక వెక్కివెక్కి ఏడుస్తున్నారు.

Arun Chilukuri
Published on: 9 April 2021 4:00 PM IST
Villagers Become Emotional While Leaving Native Place At Mallanna Sagar Project
X

Siddipet: ఊరు ఊరంతా కన్నీరు మయం.. కారణం ఇదే!

Siddipet: ఆ పల్లెళ్లన్నీ కన్నీరు పెడుతున్నాయి. ఆ పల్లె ప్రజల గుండెలు చెరువవుతన్నాయి. కన్నతల్లి లాంటి పుట్టిన ఊరిని వదలలేక గ్రామంతో ఉన్న అనుబంధాన్ని తెంపుకోలేక వెక్కివెక్కి ఏడుస్తున్నారు. చెప్పాలంటే సొంత ఇళ్లు, పొలాలు వదిలేసి ఎక్కడికో వెళ్లేందుకు వాళ్ల కాళ్లు కదలడం లేదు. అందుకే ఒకరిపై ఒకరు పడి దిక్కులు పిక్కటిల్లేలా రోధిస్తున్నారు.

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ దాదాపు పూర్తి కావొచ్చింది. జలాశయం పనులు తుది దశకు చేరడంతో ప్రాజెక్టు రిజర్వాయర్‌ లోపల ఉన్న గ్రామాలు ఒక్కొక్కటిగా ఖాళీ అవుతున్నాయి. అటు ముంపు గ్రామాల నిర్వాసితులందరికీ గజ్వేల్‌లోని ముట్రాజ్‌ పల్లి గ్రామంలో ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ నిర్మించింది ప్రభుత్వం. దీంతో ముంపు గ్రామాలైన పల్లె పహాడ్‌, వేముల ఘాట్‌ ప్రజలు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి తరలివెళ్తున్నారు.

చెప్పాలంటే దాదాపుగా నిర్వాసితులందరికీ పునరావాస ప్యాకేజీ అందించారు. అయితే కొన్ని కారణాలవల్ల కొంతమందికి ఇప్పటికీ పునరావాస ప్యాకేజీ అందలేదు. ఇక ప్రభుత్వ ప్యాకేజీ అందినవారు గ్రామాలను ఖాళీ చేసి వెళ్తున్నారు. అటు వెల్తూ వెల్తూ పరిసరాలను చూస్తూ ఇక తమ గ్రామం ఉండదని వెక్కివెక్కి ఏడుస్తున్నారు. ఇంట్లో నుండి బయటకు వస్తూ గుమ్మాలను తనివీ తీరా స్పర్శిస్తూ కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఇదిలా ఉంటే ముంపు గ్రామాలన్నీ ఖాళీ అయితే నీళ్లు నింపవచ్చని అధికారులు ఆలోచిస్తున్నారు. ఇదివరకే కొండపాక మండలంలోని ఎర్రవల్లి, సింగారం తొగుట మండలంలోని రాంపూర్‌, లక్ష్మాపూర్ గ్రామ ప్రజలు ఖాళీ చేశారు. ఇప్పటికే వేముల ఘాట్ గ్రామానికి ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో 396 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. అటు పల్లెపహాడ్‌లోని 423 కుటుంబాలకు పునరావాసం కల్పించగా 58 కుటుంబాలు గృహ ప్రవేశాలు చేశాయి.

ఏదీ ఏమైనా పునరావాసాలు, పరిహారాల మాట అటుంచితే పుట్టిన ఊరు, ఆత్మీయులను వదిలి వెళ్లడం నిజంగా దయనీయం. కొన్ని లక్షల మందికి మంచి జరగాలని పుట్టేడు దు:ఖంతో తమ మూలాలను వదిలివెళ్తుతున్న నిర్వాసిత గ్రామాల ప్రజలు నిజంగా పూజనీయులు. వారికి ఈ ప్రాంత ప్రజలందరు రుణపడి ఉంటారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story