Vaccine Shortage: తెలంగాణలో వ్యాక్సిన్ల కొరత

Vaccine Shortage in Telangana
x
కరోనా వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Vaccine Shortage: కరోనా రెండో దశ విజృంభిస్తుండటంతో వ్యాక్సినేషన్ కోసం ఎగబడుతున్నారు.

Vaccine Shortage: తెలంగాణలో వ్యాక్సిన్ల కొరత టీకాల కోసం ఎదురుచూస్తున్న వారిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు నిరాటకంగా కొనసాగిన వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆదివారం నిలిచిపోవడంతో తమకు వ్యాక్సిన్ అందుతుందోలేదోనని కొందరు అయోమయంలో ఉన్నారు. తొలుత టీకా అంటే అంత ఆసక్తి చూపని జనం. కరోనా రెండో దశ విజృంభిస్తుండటంతో వ్యాక్సినేషన్ కోసం ఎగబడుతున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా టీకా కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా అన్ని రాష్ట్రాల నుంచి డిమాండ్ పెరగడంతో అవసరాల మేరకు టీకాలు సరఫరా చేయడం కేంద్రానికి ఇబ్బందిగా మారింది.

అయితే ఆదివారం కేంద్రం నుంచి తెలంగాణకు 2.70 లక్షల వ్యాక్సిన్లు వచ్చాయి. దీంతో ఇవాళ టీకా కార్యక్రమం కొనసాగనుంది. కానీ ఈ టీకాలు ఏ మాత్రం సరిపోవని ప్రస్తుతం రోజువారీ టీకా కార్యక్రమాన్ని పరిశీలిస్తే అర్థమవుతోంది. దీంతో కొత్త వారికి మొదటి డోస్‌ నిరాటకంగా కొనసాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక రెండో డోస్‌ వారికి గడువులోగా టీకాలు ఇవ్వాల్సి ఉండటంతో వైద్యారోగ్యశాఖ తర్జనభర్జన పడుతోంది.

గత వారం రోజులుగా రోజుకు లక్షన్నర టీకాలు వేస్తున్నారు. ఒక రోజైతే మొదటి, రెండో డోస్ కలిపి దాదాపు 1.67 లక్షల వరకు కూడా వేశారు. జనవరి 16 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 29లక్షల, 59వేల, 334 కరోనా టీకాలు వేశారు. అందులో 25లక్షల, 90వేల, 245 మందికి మొదటి డోస్ వేయగా 3లక్షల, 69వేల, 89 మందికి రెండో డోస్ వేశారు. వైద్య సిబ్బందిలో 2లక్షల, 35వేల, 30 మంది మొదటి డోస్ తీసుకోగా ఇప్పటి వరకు 1లక్షా, 75వేల, 560 మంది రెండో డోస్ తీసుకున్నారు. మిగిలిన వారికి మొదటి డోస్‌ వేసి కూడా రెండు నెలలు దాటింది. దీంతో వారిలో చాలా మంది రెండో డోస్ తీసుకోవాల్సి ఉంది. ఇక ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 2లక్షల, 8వేల, 111 మంది మొదటి డోస్‌ తీసుకోగా అందులో ఇప్పటి వరకు 74వేల, 651 మంది రెండో డోస్‌ కూడా తీసుకున్నారు. ఇక 45 ఏళ్లు దాటిన వారిలో దాదాపు 21లక్షల, 55వేల, 881 మంది రెండో డోస్ తీసుకున్నారు. అందులో 1లక్షా, 10వేల, 101 మంది రెండో డోస్‌ కూడా తీసుకున్నారు.

వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్లలో రెండో డోస్‌ తీసుకునేవారి సమయం ఎప్పుడో గడిచిపోయింది. వారిలో ఇప్పుడు చాలా మంది రెండో డోస్‌ కోసం వస్తున్నారు. ఇక 45 ఏళ్లు పైబడిన వారు కూడా ప్రతి రోజూ రెండో డోస్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వచ్చే పది రోజుల్లో రోజుకు సరాసరి మొదటి డోస్‌ తీసుకునేవారు లక్షన్నర మంది రెండో డోస్‌ తీసుకునేవారు దాదాపు 30వేల మంది వరకు ఉంటారని అంచనా వేశారు. ఆ ప్రకారం వచ్చే పది రోజుల్లో 18 లక్షల టీకాలు అవసరం అవుతాయని వైద్యారోగ్యశాఖ అంచనా వేసింది. ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన టీకాలు కేవలం 2.70 లక్షలు మాత్రమే. ఈ పరిస్థితుల్లో వీటిని రెండో డోస్‌కు కేటాయించినా పది రోజులకు పూర్తిస్థాయిలో సరిపోవని అధికారులు అంటున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories