Kishan Reddy Letter To CM KCR : సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Sumitra
Published on: 13 Sept 2020 4:02 PM IST
Kishan Reddy Letter To CM KCR : సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
X

Kishan Reddy Letter To CM KCR : తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మరో సారి లేఖ రాశారు. కిషన్ రెడ్డి రాసిన ఆ లేఖలో తెలంగాణ విమోచన దినోత్సవం గురించి ఓ అంశాన్ని ప్రస్తావిస్తూ వివరించారు. కేంద్ర ప్రభుత్వం 'తెలంగాణ విమోచన పోరాట స్ఫూర్తి కేంద్రం' ఏర్పాటుకు సిద్ధంగా ఉందని ఆయన లేఖలో కేసీఆర్‌కు తెలిపారు. కేంద్రం ఏర్పాటు చేయడానికి స్థలాన్ని కేటాయించాలని కోరారు. అంతే కాదు వ్యక్తిగతంగా కేంద్రం నిర్మాణానికి శ్రద్ధ తీసుకోవాలని సీఎంను కేంద్ర మంత్రి కోరారు.

తెలంగాణ విమోచన పోరాట ఉద్యమం గురించి పూర్తి అవగాహన ఉన్న మీరు ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరుతున్నాను. హైదరాబాద్‌లో తెలంగాణ విమోచన అమరవీరుల ఉద్యమ స్పూర్తి కెంద్రానికి భూమి కేటాయిస్తే భావితరాలకు ఉపయోగపడే విధంగా ఒక అద్భుతమైన, ప్రేరణాత్మకమైన 'తెలంగాణ విమోచన పోరాట స్ఫూర్తి కేంద్రం' ఏర్పాటుకు కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ మ్యూజియం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తగిన భూమిని కేటాయించాల్సిందిగా మనవి చేస్తున్నానన్నారు. తెలంగాణా ప్రాంతంలో నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాట చరిత్ర తెలిసిన ప్రముఖ వ్యక్తిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు ఈ స్మారక స్పూర్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి కావలసిన స్థలాన్ని వెంటనే కేటాయించాలని ఆశిస్తున్నానన్నారు.

తెలంగాణ విమోచన పోరాటం దేశ చరిత్రలోనే ప్రత్యేకమైన స్థానం ఉందని, ఇది భారత దేశంలో జరిగిన పోరాటాల్లో అత్యంత ముఖ్య ఘట్టం అని అన్నారు. 1947 ఆగస్ట్ 15న దేశమంతా స్వేచ్ఛావాయువులు పీల్చిందని. అప్పటి నిజాం పాలనలో ఉన్న నేటి తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మువ్వన్నెల జెండా ఎగరలేదని మీకు తెలుసునన్నారు.

హైదరాబాద్ సంస్థానానికి విమోచనం కల్పించటంలో, తెలంగాణ ప్రజలను అనేక కష్టనష్టాలకు గురిచేసిన నిజాంను గద్దె దింపడంతో ఎంతో మంది మహానాయకుల పాత్ర ఉందన్నారు. రజాకార్ల ఆకృత్యాలను ఎదుర్కొని, తెలంగాణ విమోచన పోరాటంలో ప్రజల పక్షాన పోరాటం చేసిన వారిలో కొమురం భీం, నారాయణరావు పవార్, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ, పీవీ నరసింహారావు, రామానం తీర్థ, మర్రి చెన్నారెడ్డి, వందేమాతరం రామచంద్రరావు లాంటి వేలాది మంది ఉద్యమ పోరాట నాయకులు పాత్ర చిరస్మరణీయం అని గుర్తుచేసారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చేపట్టిన పోలీసు చర్య, తెలంగాణ ప్రాంతానికి 1948 సెప్టెంబర్ 17న నిజమైన స్వాతంత్రం తెచ్చి పెట్టిందన్న విషయం జగద్విదితమే అని పేర్కొన్నారు. ఇంతటి విశిష్ట, సాహసోపేత చరిత్ర ఉన్న 'తెలంగాణ విమోచన పోరాటం' గురించి ప్రస్తుత, భావితరాలు తెలుసుకుని స్ఫూర్తి పొందాల్సిన అవసరముందన్నారు.

Sumitra

Sumitra

Next Story