TSPSC పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

Two More Arrested in TSPSC Case
x

TSPSC పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్

Highlights

TSPSC: కేసులో ఇప్పటి వరకు 22 మంది అరెస్టు

TSPSC: TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో మరో ఇద్దరు అరెస్టయ్యారు. వికారాబాద్‌ ఎంపీడీవో కార్యాలయంలో పనిచేస్తున్న భగవంత్, అతడి తమ్ముడు రవికుమార్‌ను సిట్‌ అధికారులు అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న డాక్యా నాయక్‌ నుంచి ఏఈ పేపర్‌ను తన తమ్ముడు రవి కోసం భగవంత్‌ కొనుగోలు చేసినట్లు అధికారులు తెలిపారు. డాక్యా నాయక్‌ బ్యాంక్ ఖాతాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. 2లక్షలకు భగవంత్‌ ఏఈ పేపర్‌ కొనుగోలు చేసిన విషయం బయటపడినట్లు సిట్‌ వెల్లడించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 22 మందిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో నిందితులకు 33.4 లక్షలు అందినట్లు ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో సిట్‌ అధికారులు గుర్తించారు. కొందరు నిందితులు నగదు తీసుకోగా..మరికొందరు బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేయించుకున్నట్లు తేలింది.

ఇందులో ప్రధాన నిందితుడు పులిదిండి ప్రవీణ్‌కుమార్‌కు 16 లక్షలు ముట్టినట్లు వెల్లడైంది. ఏఈ సివిల్‌ ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్‌కుమార్‌.. గురుకుల పాఠశాల ఉపాధ్యాయురాలు రేణుకారాథోడ్‌, ఆమె భర్త డాక్యాకు ఇచ్చేందుకు 10 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. రేణుక తన సోదరుడు కేతావత్‌ రాజేశ్వర్‌ కోసం దీన్ని కొనుగోలు చేసింది. తర్వాత కేతావత్‌ రాజేశ్వర్‌, డాక్యాలు ఆ ప్రశ్నపత్రాన్ని అయిదుగురికి 10 లక్షల చొప్పున విక్రయానికి బేరం పెట్టారు. కానీ అందరూ అంత మొత్తం ఇవ్వలేదు. నీలేశ్‌నాయక్‌ 4.95 లక్షలు, గోపాల్‌నాయక్‌ 8 లక్షలు, ప్రశాంత్‌రెడ్డి 7.5 లక్షలు, రాజేంద్రకుమార్‌ 5 లక్షలు, వెంకటజనార్దన్‌ 1.95 లక్షలు ఇచ్చారు. మొత్తం 27.4 లక్షలు వచ్చాయి. వెంకటజనార్దన్‌ నగదును డాక్యా బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు. మిగిలిన వారు నగదు ఇచ్చారు.

ఇందులో 10 లక్షలను ప్రవీణ్‌కుమార్‌కు ఇవ్వగా.. వారికి 17.4 లక్షలు మిగిలాయి. మరోవైపు డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ప్రశ్నపత్రాన్ని ప్రవీణ్‌కుమార్‌.. సాయిలౌకిక్‌, సాయిసుస్మిత దంపతులకు అమ్మాడు. ఇందుకోసం వారిద్దరు ప్రవీణ్‌కుమార్‌కు 6 లక్షలు ముట్టజెప్పారు. అలా ప్రవీణ్‌కుమార్‌కు 16 లక్షలు, డాక్యా, రాజేశ్వర్‌లకు 17.4 లక్షలు కలిపి ఈ మొత్తం వ్యవహారంలో 33.4 లక్షలు చేతులు మారాయని కోర్టుకు సిట్‌ నివేదించింది.

డీఏవో ప్రశ్నపత్రం విక్రయంతో వచ్చిన సొమ్మును ప్రవీణ్‌కుమార్‌ బ్యాంకులోనే దాచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. బాలాపూర్‌ క్రాస్‌రోడ్డు ఎస్‌బీఐ శాఖలోని అతడి ఖాతాలో ఉన్న ఆ సొమ్మును సిట్‌ అధికారులు స్తంభింపజేశారు. రేణుక బృందం నుంచి తనకు వచ్చిన 10 లక్షల్లో 3 లక్షల్ని ప్రవీణ్‌కుమార్‌ తన మేనమామ శ్రీనివాసరావుకు అవసరం నిమిత్తం ఇచ్చాడు. ప్రవీణ్‌పై కేసు నమోదైన అనంతరం శ్రీనివాసరావు గత మార్చి 28న ఆ డబ్బును సిట్‌ అధికారులకు అప్పగించాడు.

ఏఈ ప్రశ్నపత్రాల విక్రయంతో వచ్చిన సొమ్ములో నుంచి కొంతమొత్తంతో రాజేశ్వర్‌ ప్రభుత్వ కాంట్రాక్టు పనులు చేశాడు. గండీడ్‌ మండలం మన్సూర్‌పల్లి తండాలో 3 లక్షలతో హైమాస్ట్‌ లైట్ల బిగింపు పనులు, 1.8 లక్షలతో భూగర్భ డ్రైనేజీ పైపుల పనులు చేపట్టాడు. అప్పులు తీర్చేందుకు 4.5 లక్షలు వెచ్చించాడు. డాక్యా బ్యాంకు ఖాతాలో 3.95 లక్షలున్నట్లు గుర్తించి స్తంభింపజేశారు.

గ్రూప్‌-1 పేపర్‌ను నిందితుడు అట్ల రాజశేఖర్‌రెడ్డి... న్యూజిలాండ్‌లో ఉన్న తన బావ సానా ప్రశాంత్‌తో పాటు టీఎస్‌పీఎస్సీలో ఏఎస్‌వోగా పనిచేసిన షమీమ్‌కు ఉచితంగా ఇచ్చినట్లు గుర్తించారు. ప్రవీణ్‌కుమార్‌ సైతం గ్రూప్‌-1 ప్రశ్నపత్రాన్ని టీఎస్‌పీఎస్సీ మాజీ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి సురేశ్‌, కమిషన్‌లో డేటాఎంట్రీ ఆపరేటర్‌ రమేశ్‌కుమార్‌కు ఉచితంగా ఇచ్చినట్లు వెల్లడైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories