CM KCR: ఢిల్లీ బ్రోకర్లు ఎమ్మెల్యేలను కొందామని వచ్చారు

TRS Public Meeting in Chandur | Telangana News
x

చండూరులో టీఆర్ఎస్‌ బహిరంగ సభ

Highlights

CM KCR: న్యాయం ఏంటో.. ధర్మం ఏంటో మీకు తెలుసు

CM KCR: నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ పరిధిలోని బంగారిగడ్డలో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ బహిరంగ సభకు టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హాజరై ప్రసంగించారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపైనా కేసీఆర్ నిప్పులు చెరిగారు. కొంతమంది ఢిల్లీ బ్రోకర్ గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కొందామని వచ్చారని, కానీ 100 కోట్లు ఇస్తామన్నా అమ్ముడుపోకుండా తమ ఎమ్మెల్యేలు తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడారని కొనియాడారు.

గాడిదకు గడ్డేస్తే ఆవుకు పాలు రావు..

'మౌనంగా ఉంటే.. ఆ మౌనమే శాపమైతది. ప్రేక్షకుల్లా చూసి మనది కాదు అనుకూనే సందర్భం కాదు. ప్రతి విద్యావంతుడు తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం. దయచేసి మునుగోడులో విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, అన్నదమ్ముళ్లు, అక్కాచెళ్లెల్లు ఊరికి వెళ్లిన తర్వాత చర్చ చేయాలి. ఓటు వేసేటప్పుడు దేనికో ఆశపడి, ఎవడో చెప్పిండని మాయమాటకు లొంగి ఓట్లు వేస్తే మంచి జరుగదు. మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే రావు. చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలే. ఓటు వేసే టప్పుడు జాగ్రత్తగా వేయాలి. గాడుదలకు గడ్డేసి.. ఆవులు పిండితే పాలు రావు. గడ్డి వేసేటప్పుడే గాడిదికి వేస్తున్నామా? ఆవుకు వేస్తున్నమా? అని ఆలోచన చేయాలి' అని సీఎం కేసీఆర్‌ సూచించారు.

మోడీకి ఇంకా ఏం కావాలి..?

'నరేంద్ర మోదీని అడుగుతున్నా నీకు ఇంకా. దేశంలో ప్రధాని పదవిని మించి పదవి ఇంకా లేదు కదా. ఒకసారి కాదు రెండుసార్లు అవకాశం వచ్చింది కదా? ఎందుకు ఈ కిరాతకం. ఎందుకీ అరాచకం. దేశం కోసం, సమాజానికి ఏ రకంగా మంచిదో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకు ఇవన్నీ ప్రోత్సహిస్తున్నరు. మోదీ అండదండలు లేకుండానే ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్‌కు వచ్చి ఇప్పుడు చంచల్‌గూడ జైలులో ఉన్నరు. వాళ్లు ఆఫర్‌ చేసిన వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో విచారణ జరగాలి. దీని వెనుక ఎవరు ఉన్నరో వారు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హులు కాదు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఇంత అరాచకం జరుగుతుంటే మనం మౌనంగా ఉందామా? ఆలోచించాలని కోరుతున్నా' అని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories