వరి పోరును హోరెత్తిస్తున్న టీఆర్‌ఎస్.. ఆందోళనతో హీట్ పుట్టిస్తున్న...

TRS Paddy Protest: ఇవాళ రైతుల ఇళ్లపై నల్లజెండాలు, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మల దగ్ధం...

Shireesha
Published on: 8 April 2022 7:43 AM IST
TRS Protests to Procurement of Paddy by Central Govt | TRS vs BJP
X

వరి పోరును హోరెత్తిస్తున్న టీఆర్‌ఎస్.. ఆందోళనతో హీట్ పుట్టిస్తున్న...

TRS Paddy Protest: టీఆర్ఎస్ వరిపోరును హోరెత్తిస్తోంది. వరుస ఆందోళనలతో హీట్ పుట్టిస్తున్న గులాబిపార్టీ నిన్న జిల్లాకేంద్రాల్లో దీక్షలు చేపట్టింది. టీఆర్ఎస్ దీక్షలతో జిల్లా కేంద్రాలన్ని ఉద్యమ క్షేత్రాలు అయ్యాయి. దీక్షలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రైతుబంధు సమితి ఛైర్మన్లు సహా ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలి వచ్చారు. సిరిసిల్లలోని అంబేడ్కర్​ కూడలిలో నిర్వహించిన నిరసన దీక్షలో మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం అనుసరిస్తోన్న వైఖరిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర బీజేపి నాయకుల పై విమర్శలతో విరుచుకుపడ్డారు

సిద్దిపేట జిల్లా కేంద్రంలో జరిగిన వరి దీక్షలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. సంగారెడ్డి దీక్షకు తలసాని, వరంగల్ లో నిర్వహించిన దీక్షకు ఎర్రబెల్లి హాజరయ్యారు. కేంద్రం వడ్ల విషయంలో మొండి వైఖరి ప్రదర్శిస్తోందని హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్‌లో చేపట్టిన నిరసనలో పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్‌ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందే అంటూ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ హెచ్చరించారు.

పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట చేపట్టిన రైతు దీక్షకు కొప్పుల హాజరయ్యారు. ఖమ్మం ధర్నాచౌక్‌ వద్ద రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ పాల్గొన్నారు. మేడ్చల్ జిల్లాలో టీఆర్ఎస్ చేపట్టిన ధర్నాలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. మేడ్చల్ దీక్షలో మంత్రి మల్లారెడ్డి, నల్గొండలో విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి మహమూద్‌ అలీ పాల్గొన్నారు. నిజామాబాద్‌లో నిరసనదీక్షలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్‌ రెడ్డి కేంద్రం తీరుపై మండిపడ్డారు.

ఇక మహబూబాబాద్ దీక్ష టిఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఎంపీ మాలోతు కవిత మాట్లాడుతుండగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆమె చేతిలో నుంచి మైక్ లాగేసుకోవడంతో కలకలం రేపింది. ఇక వరుస ఆందోళనలో భాగంగా రైతుల ఇళ్ల మీద నల్ల జెండాలు ఎగరేసి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేయాలని టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఆ తర్వాత ఈ నెల 11న ఢిల్లీలో టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దీక్ష చేపట్టనున్నారు.

Shireesha

Shireesha

Next Story