గువ్వలను ఆటాడుకున్న సోషల్‌ మీడియా.. అచ్చంపేటలో అడుగుపెట్టాలంటేనే వణికిపోయే..

Guvvala Balaraju: గువ్వల బాలరాజు... ఈ పేరు నిన్నమొన్నటికి వరకు సోషల్ మీడియాలో మారు మ్రోగింది.

Arun Chilukuri
Published on: 13 Nov 2021 1:43 PM IST
TRS MLA Guvvala Balaraju not Participated in Raithu Diksha
X

గువ్వలను ఆటాడుకున్న సోషల్‌ మీడియా.. అచ్చంపేటలో అడుగుపెట్టాలంటేనే వణికిపోయే..

Guvvala Balaraju: గువ్వల బాలరాజు... ఈ పేరు నిన్నమొన్నటికి వరకు సోషల్ మీడియాలో మారు మ్రోగింది. హుజురాబాద్ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత అన్న చందంగా మారింది టీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరిస్థితి. ఎన్నికలకు ముందు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించిన గువ్వల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమితో ఇరుకున పడ్డారు. ఎంత ఇరకాటంలో పడ్డారంటే రాష్ట్రంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా అదిష్టానం ఇచ్చిన రైతు ధర్నా పిలుపులో పాల్గొంటే ఆయన మాత్రం సోషల్ మీడియా ధాటికి సొంత నియోజకవర్గంలో కూడా ధర్నాలో పాల్గొనలేనంత ఇరకాటంలోకి నెట్టబడ్డారు.

హుజూరాబాద్‌లో బీజేపీ గెలిస్తే తన ఎమ్మేల్యే పదవికి రాజీనామా చేస్తానన్న నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజును ఎన్నికల రిజల్ట్ తర్వాత సోషల్ మీడియా ఓ ఆటఆడుకుంది. రాజీనామా ఎప్పుడు చేస్తావంటూ వచ్చిన ఫోన్లు పోస్టులతో గువ్వల బాలరాజుకు దిమ్మదిరిగినంత పనైంది. ఈ సోషల్ మీడియా దాడితో గువ్వల బాలరాజు చాలా డిస్టర్బ్ అయ్యారనే చెప్పక తప్పదు.

నిన్న, మొన్నటి వరకు తన నియోజకవర్గంలో పులిలా తిరిగిన గువ్వల బాలరాజు ఇప్పుడు అచ్చంపేటలో అడుగుపెట్టాలంటేనే వణికిపోయే పరిస్థితి వచ్చింది. ఇందుకు ఉదాహరణగా నిలిచింది అధికార పార్టీ చేపట్టిన రైతు ధర్నా కార్యక్రమం. ప్రతి ఎమ్మెల్యే వారి వారి నియోజకవర్గంలో రైతు ధర్నాలో పాల్గొనాలని అదిష్టానం నుంచి ఆదేశాలున్నా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన రైతు ధర్నాకు మాత్రం ఎమ్మెల్యే గువ్వల బాలరాజు హాజరుకాలేదు. ఈ ధర్నా ముందు నిర్ణయించినదే అందులో సీఎం కేసీఆర్ నిర్ణయించిన ధర్నా అయినా గువ్వల బాలరాజు హాజరుకాకపోవడంపై అచ్చంపేటలో గుసగుసలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాకు భయపడే గువ్వల ధర్నాకు హాజరు కాలేదన్న పుకార్లు శికార్లు చేస్తున్నాయి

అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ ఎడ్ల నరసింహ గౌడ్, అచ్చంపేట ఎంపీపీ లోక్యనాయక్‌లు ధర్నాకు హాజరై సోషల్ మీడియాపై విరుచుకుపడటం ఆ పుకార్లకు బలం చేకూర్చుతున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు సైతం గువ్వల బాలరాజు గైర్హాజర్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. ధర్నాలో ఎందుకు పాల్గొనలేదో అందరికీ తెలుసని నాగర్ కర్నూల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అద్యక్షుడు వంశీ కృష్ణ ఎద్దేవా చేశారు. అచ్చంపేట నియోజకవర్గంలో అన్ని పార్టీలపై మాటలతో దండయాత్ర చేసే గువ్వల బాలరాజు అధిష్టానం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు ధర్నాలో ఎందుకు పాల్గొనలేరన్నది ఎవ్వరికీ అంతుచిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story