తెలంగాణలో సరికొత్త చర్చ గులాబినేతలను ఊరిస్తోంది

Arun Chilukuri
Updated on: 25 Jan 2021 1:01 PM IST
తెలంగాణలో సరికొత్త చర్చ గులాబినేతలను ఊరిస్తోంది
X

తెలంగాణలో సరికొత్త చర్చ గులాబినేతలను ఊరిస్తోంది

తెలంగాణలో సరికొత్త చర్చ గులాబినేతలను ఊరిస్తోంది. త్వరలో మంత్రి కేటీఆర్‌ ముఖ్యమంత్రి అవుతారని పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయన అభిమానులు సంబరపడిపోతున్నారు. దీంతో పార్టీలో ఖాళీగా ఉన్న పోస్టులు కేటీఆర్‌ సీఎం కావడానికి ముందే కేసీఆర్‌ భర్తీ చేస్తారని ఆశిస్తున్నారు. మరి వీరిని గులాబి బాస్‌ ఎప్పుడు కనుకరించనున్నారు..?

ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ పార్టీలో పాత, కొత్త నేతల మధ్య పొరపొచ్చాలు పదవుల దగ్గరే వస్తున్నాయి. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన కొందరికి త్వరలోనే పదవులు వరించాయని.. ఉద్యమ కాలం నుంచి ఉన్న నేతలు అసంతృప్తితో ఉన్నారు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ పార్టీ పెద్దలను కలుస్తూ ప్రతీసారి వేడుకుంటున్నారు. తమ బయోడేటాలు అందిస్తున్న నేతలు నామినేటెడ్‌ పోస్టులు, ధార్మిక ఆలయాల్లో పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు.
మరోవైపు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్న కేటీఆర్‌ త్వరలోనే సీఎం పగ్గాలు చేపట్టబోతున్నట్లు ఆపార్టీ నేతలే చెబుతున్నారు. కేటీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టా సారిస్తారని అందుకే ఇప్పటినుంచి ప్రిపేర్‌ అవుతున్నారని గులాబి పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కేటీఆర్‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చే రెండేళ్లు అంతా సాఫిగా ఉండేలా కేసీఆర్‌ చక్కదిద్ది వెళ్తారనే టాక్‌ కూడ నడుస్తోంది.
పార్టీలో ఎలాంటి పదవులు లేకున్నా గులాబీ జెండా మోస్తున్న వారు చాలామందే ఉన్నారు. అధినేత మాటిచ్చారు ఏదోరోజు తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకంతోనే ఉన్నారు. చెప్పాలంటే బీజేపీ దూకుడుతో గులాబీ అధినేత అలెర్ట్‌ అయ్యారు. అసంతృప్తులకు కమళనాథులు గాలం వేయకుండా, పార్టీని బలహీన పర్చుకోకుండా ఉన్న పదవులను హామీ ఇచ్చిన నేతలకు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఇదే మాట తనను కలిసిన నేతలకు కేటీఆర్‌యే స్వయంగా చెబుతున్నారట.

మొత్తానికి రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు ఇంతకాలం పదవుల కోసం వేచి చూస్తున్న నేతలను ఊరిస్తోంది. దీంతో గులాబి బాస్‌ కేసీఆర్‌ తమను ఎప్పుడు పిలిచి వరమిస్తారోనని ఎదురుచూస్తున్నారు నేతలు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story