హైదరాబాద్ చందానగర్ రాజీవ్ గృహకల్పలో దారుణం.. భార్య, పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న నాగరాజు

Hyderabad: భార్యపై అనుమానంతోనే దారుణానికి ఒడిగట్టాడన్న పోలీసులు

Jyothi
Published on: 17 Oct 2022 11:58 AM IST
Tragedy In Hyderabad Chandanagar
X

హైదరాబాద్ చందానగర్ రాజీవ్ గృహకల్పలో దారుణం.. భార్య, పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్న నాగరాజు

Hyderabad: ఆ ఇంట్లో అనుమానమే పెనుభూతంగా మారింది. భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త... భార్యా పిల్లలను టైలరింగ్ చేసే కత్తెరతో దారుణంగా పొడిచి చంపి.. తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు... హైదరాబాద్ చందానగర్ రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివసించే నాగరాజు తన భార్య సుజాతపై అనుమానం పెంచుకున్నాడు. భార్య సుజాత, పిల్లలు రమ్యశ్రీ, టిల్లును టైలరింగ్ కత్తెరతో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఆపై తానూ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య సుజాతపై అనుమానంతోనే ఆమెను, పిల్లలను చంపి... తానూ ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక దర్యాప్తు తర్వాత తెలిపారు.

గత శుక్రవారం ఈ ఘటన జరిగినట్లు స్థలంలో లభించిన ఆధారాలవల్ల తెలుస్తోంది. రాజీవ్ గృహకల్ప సముదాయంలో నాగరాజు, అతడి భార్య సుజాత, పిల్లలు రమ్యశ్రీ, టిల్లు నివసిస్తున్నారు. కాగా గత శుక్రవారం నుంచి వారి ఇంటి తలుపులు మూసి ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇంట్లో నుంచి దుర్గంధం రావడంతో స్థానికులు తలుపులు పగులగొట్టి చూడడంతో ఈ దారుణ సంఘటన విషయం వెలుగులోకి వచ్చింది. వీరంతా ఏడు సంవత్సరాలుగా రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివసిస్తున్నారని, కుటుంబ కలహాలే ఈ ఘటనకు కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదుతో చందానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నాగరాజు లూనా మోపెడ్‌పై తిరుగుతూ బ్రెడ్లు విక్రయించేవాడని, భార్య సుజాత టైలరింగ్ పనిచేస్తుండేదని స్థానికులు చెప్పారు.

Jyothi

Jyothi

Next Story