
తెలంగాణ కాంగ్రెస్లో రగిలిన విభేదాల కుంపటి
T Congress: యశ్వంత్ సిన్హా పర్యటనతో భగ్గుమన్న విభేదాలు
T Congress: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పర్యటన తెలంగాణ కాంగ్రెస్లో చిచ్చు రేపింది. వ్యక్తిగత విమర్శలు నాయకుల మధ్య ఉండొద్దని... క్రమశిక్షణ అవసరమని రాహుల్ సూచనతో కొన్నాళ్లు స్థబ్ధుగా ఉన్నప్పటికీ... యశ్వంత్ సిన్హా పర్యటనతో విభేదాలు భగ్గుమన్నాయి. నాయకుల మధ్యమాటల తూటాలు పార్టీ ప్రతిష్టను మసకబారుతోందని పార్టీ వర్గాలు మదనపడుతున్నాయి.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనాయకులు ఐకమత్యం మూణ్ణాళ్ల ముచ్చటలా మారింది. నాయకులు హుందాగా వ్యవహరించాలని, గ్రూపు రాజకీయాలు ఆరోగ్యకరం కాదని, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకుల్లో మార్పొచ్చింది. అందరూ కలసికట్టుగా ఉన్నట్లు వ్యవహరించారు. ఎలాంటి వివాదాలు లేకుండా రోజులు గడిచాయి. పార్టీ మంచి జోష్ మీద ఉందనుకుంటున్న సమయంలో రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ పర్యటన అగ్గిరాజేసింది. స్తబ్ధుగా ఉన్న గ్రూపు రాజకీయాలు తారా స్థాయికి చేరుకున్నాయి..
రాష్ట్రపతి ఎన్నికల బరిలో విపక్షాల అభ్యర్థిగా బరిలో దిగిన యశ్వంత్ సిన్హా... టీఆర్ఎస్ మద్ధతుకోసం హైదరాబాద్ వచ్చారు. ఎన్నికల్ల రాజకీయ పరంగా కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఇస్తున్నప్పటికీ... తెలంగాణలో ప్రధాన రాజకీయ ప్రత్యర్థి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కోసం వచ్చిన రాష్ట్రపతి అభ్యర్థి సిన్హాను కాంగ్రెస్ పార్టీనుంచి ఎవ్వరూ కలవకూడదని ఒక రోజు ముందే టీకాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హుకుం జారీ చేశారు. టీఆరెస్ ని కలిసిన యశ్వంత్ సిన్హా గాంధీ భవన్ కి వస్తే అది ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తంచేశారు. టీఆరెస్ ,కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒకటే నని తప్పుడు సంకేతాలు వెళ్తాయని రేవంత్ రెడ్డి భావించారు.
యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రానే వచ్చారు. బేగంపేట ఎయిర్పోర్టులో సీనియర్ నేత వి.హనుమంతరావు, సిన్హాకు పుష్పగుచ్ఛాన్ని అందించి స్వాగతించారు. కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఎయిర్పోర్టుకెళ్లడంపై కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి మండి పడ్డారు.
కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఫైరయ్యారు. సీఎల్పీ ఈ విషయం లో సరైన విధంగా వ్యవహరించలేదన్నారు. అధ్యక్షపదవిలో ఉన్నవాళ్లకు ఆవేశం పనికిరాదన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవినుంచి రేవంత్ రెడ్డిని తొలగించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయంపై సోనియా గాంధీకి లేఖరాస్తామన్నారు.ప్రజాక్షేత్రంలోకి వెళ్లాల్సిన నేతలు... మాటల యుద్ధానికి దిగడం... జనాల్లో చులకనభావన ఏర్పడుతోందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. నాయకుల మధ్య గొడవలు సద్దుమణిచేందుకు అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మరి.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2023. All rights reserved.
Powered By Hocalwire