Tika Utsav: తెలుగు రాష్ట్రాల్లో నిండుకున్న టీకా డోసులు

Tika Utsav: తెలుగు రాష్ట్రాల్లో నిండుకున్న టీకా డోసులు
x
కరోనా వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Corona Vaccine: మరో రెండు రోజులకు మాత్రమే సరిపోనున్న టీకాలు * తెలంగాణలో కేవలం 4.80 లక్షల డోసులు మాత్రమే

Corona Vaccine: మొన్నటి వరకు టీకా కేంద్రాలు వెలవెలబోయాయి. టీకా తీసుకోవాలని ప్రభుత్వాలు, అధికారులు నెత్తినోరు మొత్తుకున్నా.. మాకొద్దు టీకా అన్నట్లు వ్యవహరించారు జనాలు. సైడ్‌ ఎఫెక్ట్‌ ఉంటుందనే భ్రమతో టీకా కేంద్రాల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ ఇప్పుడు కరోనా జెడ్‌స్పీడ్‌లా దూసుకువస్తుంది. అందరినీ టచ్‌ చేసే వెళ్తా అన్నట్లు వ్యాపిస్తోంది. దీంతో దెబ్బకు జనాలు వ్యాక్సిన్ కోసం పరుగులు తీస్తున్నారు. కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ ఏదైనా పర్వాలేదు తమొకటి ఇవ్వండి చాలూ ఉన్నట్లు టీకా కేంద్రాల ముందు క్యూ కడుతున్నారు. దీంతో గడిచిన 5 రోజుల్లోనే టీకా తీసుకున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.

మొన్నటి వరకు స్టోర్‌ రూంలో మూలిగిన టీకాలు ఇప్పుడు నిండుకున్నాయి. జనాలు ఎగబడడంతో టీకా నిల్వలు తగ్గిపోయాయి. మరో రెండు రోజులు గడిస్తే టీకా కేంద్రాల ముందు నో స్టాక్‌ బోర్డు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వైద్యవర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 5 లక్షల 9వేల 34 మంది తొలి డోసు తీసుకున్నారు. రోజుకు సగటున లక్ష మంది టీకా వేయించుకున్నారు. ఇక శనివారం సాయంత్రం నాటికి రాష్ట్రంలో 5.66 లక్షల డోసులే ఉన్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో 85 వేల మందే తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం 4.80 లక్షల డోసులే ఉన్నాయి. ఏపీలో అయితే 2లక్షల డోసులు మాత్రమే ఉన్నాయి. ఇవి ఇవ్వాల్టీ వరకు సరిపోతాయి. ఇక విశాఖలో మరీ దారుణం. విశాఖలోని అన్ని కేంద్రాల్లో టీకాలు పూర్తిగా నిండుకున్నాయి. దీంతో టీకాలు పంపించాలని తెలంగాణ సీఎస్‌, ఏపీ సీఎం జగన్ కేంద్రానికి లేఖలు రాశారు. కానీ ఇంతవరకు కేంద్రం నుంచి స్పందన మాత్రం లేదు.

కొన్ని కేంద్రాల్లో అయితే ఫస్ట్‌ డోస్‌ తీసుకున్న వారికి సెంకడ్‌ డోస్‌ దొరకడం లేదు. టీకా కేంద్రాల చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా నో స్టాక్‌ అని చెబుతున్నారు. ఫస్ట్‌ డోస్‌ తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోతుందని జనాలు వాపోతున్నారు.

నిజానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల 11 నుంచి 14 వరకూ టీకా మహోత్సవ్‌ జరపాలని ప్రకటించింది. ప్రకటన అయితే చేసింది కానీ ఏయే రాష్ట్రాల్లో ఎన్నెన్ని టీకా నిల్వలు ఉన్నాయి. ఇంకెన్నీ టీకాలు పంపించాలి అనే లెక్కలను మాత్రం విస్మరించింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో టీకా కొరత ఏర్పడింది. ఇప్పటికే ఒడిషాలో 900 టీకా కేంద్రాలకు తాళాలు వేసినట్లు బీజేడీ ప్రభుత్వం వెల్లడించింది. రేపటికల్లా టీకాలు రాష్ట్రానికి రాకుంటే రాష్ట్రవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ పూర్తిగా నిలిచిపోతుందని ఆ ప్రభుత్వం చెబుతోంది.

ఒక్క ఒడిషానే కాదు మహారాష్ట్ర, పజాంబ్‌, ఢిల్లీల్లోనూ టీకా కేంద్రాలు మూతపడనున్నాయి. పంజాబ్‌ ప్రభుత్వమైతే ఇంకా 5 రోజులు మాత్రమే టీకా ఇవ్వగలమని ప్రకటించింది. టీకాలు పంపించండి అంటూ సీఎం అమరీందర్‌సింగ్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

ఇండియాలో టీకా కొరత వేధిస్తుంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం టీకా డోసులను ఇతర దేశాలకు ఎగుమతులు చేస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ముందుగా దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరీ కేంద్రం వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఎలా పూర్తి చేస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories