Telangana: రాష్ట్ర ఖజానా కళకళ.. గాడిన పడుతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ

Telangana: కరోనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే.

Sumitra
Published on: 4 July 2020 10:45 AM IST
Telangana: రాష్ట్ర ఖజానా కళకళ.. గాడిన పడుతున్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ
X
Representational Image

Telangana: కరోనా లాక్ డౌన్ కారణంగా రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. దాదాపు మూడు నెలల లాక్‌డౌన్‌తో ప్రజలు ఇండ్లకే పరిమితవడం, దాదాపు పరిశ్రమలన్నీ మూతపడటం, వ్యాపారాలు మందగించటంతో ఆర్థిక లావాదేవీలు స్తంభించాయి. లాక్‌డైన్‌ ఆంక్షల సడలింపు తర్వాత పరిశ్రమలు తిరిగి తెరుచుకున్నాయి. ఉత్పత్తితోపాటు అమ్మకాలు, కొనుగోళ్లు పెరిగాయి. ఇతర ఆర్థిక లావాదేవీలు ప్రారంభమవటంతో ఖజానాకు రాబడులు పెరుగుతున్నాయి. గత ఏడాది జూన్‌లో గత నెలలో రాష్ట్ర ఖజానాకు వాణిజ్యపన్నులు, ఎక్సైజ్‌, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మైనింగ్‌శాఖల ద్వారా వచ్చిన ఆదాయం కన్నా ఈ ఏడాది రూ.1060 కోట్లు ఎక్కువ వచ్చింది. ఈ ఏడాది రూ.5,962 కోట్ల ఆదాయం రావడంతో ఈ ఏడాది 21 శాతం అధిక ఆదాయం లభించింది. ఇక ఐజీఎస్టీలో రాష్ట్రవాటా, బాండ్ల ద్వారా సమీకరించిన నిధులను కలుపుకొంటే గత నెల ఖజానాలో రూ.11వేల కోట్ల వరకు జమయ్యాయి.

ఇక పోతే ఈ ఏడాది జూన్‌ మాసంలో రూ.3,766 కోట్లు వాణిజ్య పన్నులరూపంలో రాష్ట్ర ఖజానాకు వచ్చాయి. గత ఏడాది జూన్‌తో పోల్చితే రూ.336 కోట్లు అధికంగా రావడం విశేషం. ఇక పోతే మే నెల వరకు రూ.30 కోట్లు దాటని రిజిస్ట్రేషన్ల రాబడి జూన్‌లో ఒక్కసారే రూ.460 కోట్ల వరకు చేరుకున్నది. గత ఏడాదితో పోల్చితే రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా రాబడి కాస్తతగ్గినా.. ఎక్సైజ్‌శాఖ (115శాతం), మైనింగ్‌ శాఖ (40శాతం) అధిక రాబడులు సాధించాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల ద్వారా గత నెలలో దాదాపు రూ.4,500 కోట్ల వరకు సేకరించింది. ఈ భరోసాతోనే రాష్ట్ర ప్రభుత్వం గత నెల కాలానికి ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి వేతనాలు చెల్లించేందుకు ఉపక్రమించింది. రాష్ట్ర పరపతి దృష్ట్యా ఈ నిధులు తక్కువ వడ్డీకే సమకూరాయి. దీనికి ఐజీఎస్టీలో రాష్ట్ర వాటాను కలుపుకొంటే రూ.11వేల కోట్ల వరకు ఆదాయం వచ్చినట్టేనని అధికారులు చెప్తున్నారు.


Sumitra

Sumitra

Next Story