Telangana Local Body Elections: ఆ 5 గ్రామాలు ఈసారి ఎన్నికలకు దూరమేనా..?

Telangana Local Body Elections: ఆ ఐదు గ్రామాల్లో ఒక్క గిరిజన ఓటరు కూడా లేరు.. అయినా సర్పంచ్ పదవులను ఎస్టీలకు రిజర్వ్ చేశారు.

Arun Chilukuri
Published on: 4 Dec 2025 12:08 PM IST
Telangana Local Body Elections: ఆ 5 గ్రామాలు ఈసారి ఎన్నికలకు దూరమేనా..?
X

Telangana Local Body Elections: ఆ 5 గ్రామాలు ఈసారి ఎన్నికలకు దూరమేనా..?

Telangana Local Body Elections: ఆ ఐదు గ్రామాల్లో ఒక్క గిరిజన ఓటరు కూడా లేరు.. అయినా సర్పంచ్ పదవులను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. అక్కడి ఎన్నికల నిర్వహణపై సందిగ్ధం నెలకొంది. గత సర్పంచ్ ఎన్నికల్లో గిరిజన ఓటర్లు లేక ఒక్కరూ పోటీ చేయకపోవడంతో ఎన్నికలే నిర్వహించలేదు. ఈసారి కూడా ఆ ఐదు గ్రామాల స్థానిక సంస్థల ఎన్నికలకు దూరం అవుతాయా...?

నాగర్‌ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో 20 గ్రామ పంచాయతీలున్నాయి. 19 గ్రామాలు ఏజెన్సీలోకి, తుర్కప్లలి గ్రామం నాన్ ఏజెన్సీలో ఉంది. మండలంలోని బీకే లక్ష్మాపూర్‌లో 618 ఓట్లు, వంగురోనిపల్లి 621, కుమ్మరోనిపల్లి 1,169, కల్ములోనిపల్లి 556, ప్రశాంత్నగర్ 438 ఓట్లు ఉన్నాయి. ఇది ఏజెన్సీ ప్రాంతం కావడంతో ఒక్క గిరిజన ఓటరు లేకున్నా సర్పంచ్ పదవులను ఎస్టీలకు రిజర్వ్ చేశారు. దీంతో సర్పంచ్ పదవులను ఇతర సామాజిక వర్గాలకు కేటాయించి ఎన్నికలు నిర్వహిం చాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.

గ్రామాలను నాన్ ఏజెన్సీ గ్రామాలుగా గుర్తించి జనాభా దమాషా ప్రకారం సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్ స్థానాలను కేటాయించాలని ఐదు గ్రామ పంచాయతీల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో ఆయా గ్రామాల ప్రజలు వైరల్ చేశారు. వెరసి ఎన్నికల సంఘం ఎన్నికల నగారా ప్రకటించింది. ఈ తరుణంలో ఆ గ్రామాల ప్రజలు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనన్న ఉత్కంఠ నెలకొంది.

ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి ఈ గ్రామాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి సర్పంచుల నియామకం జరిగేలా నిర్ణయాలు తీసుకోవాలని ప్రజల నుండి డిమాండ్ పెరుగుతుంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story