Lockdown Cutting Salaries : కోత పెట్టిన జీతాల చెల్లింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు

Sumitra
Published on: 1 Oct 2020 9:43 AM IST
Lockdown Cutting Salaries : కోత పెట్టిన జీతాల చెల్లింపునకు ప్రభుత్వం ఉత్తర్వులు
X

Lockdown Cutting Salaries : కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో అలాగే పింఛన్‌దారుల పింఛన్ లో కోతను విధించిన విషయం తెలిసిందే. అయితే విధించిన కోత మొత్తాన్ని వారి వారి అకౌంట్లల్లో జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు, ఇతరులకు నాలుగు వాయిదాల్లో అలాగే పింఛన్‌దారులకు రెండు వాయిదాల్లో పూర్తి మొత్తాన్ని జమ చేస్తామని తెలిపారు. ఐఏఎస్‌ అధికారులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, పింఛన్‌దారులు, ఇతరుల వేతనాల నుంచి మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విధించిన కోత మొత్తాన్ని మళ్లీ వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది అక్టోబర్, నవంబర్‌ నెలల్లో రెండు వాయిదాల్లో పింఛన్‌దారులకు పూర్తి మొత్తాన్ని జమ చేయనున్నారు.

ఇక ఎయిడెడ్‌ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు, ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే కోత పడిన వేతనాలను జమ చేయనున్నారు. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్‌తో పాటు వచ్చే ఏడాది జనవరిలో కలిపి మొత్తం నాలుగు వాయిదాల్లో జిల్లాల అధికారులు, ఐఏఎస్‌ అధికారులు, గెజిటెడ్, నాన్‌గెజిటెడ్, నాలుగోతరగతి ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, ప్రజాప్రతినిధుల గౌరవ వేతనాలను చెల్లించనున్నారు. కాగా లక్షలాది మంది ఉద్యోగులు, పింఛన్‌దారులు కోత విధించిన వేతనాలను ప్రభుత్వం ఏ రూపంలో జమ చేస్తుందోనన్న ఆందోళనలో ఉన్నప్పటికీ తాజా ఉత్తర్వులు కాస్త ఊరట కలిగించాయి.

Sumitra

Sumitra

Next Story