ప్రధాని మోడీని కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ

Arun Chilukuri
Updated on: 12 Dec 2020 9:15 PM IST
ప్రధాని మోడీని కలిసిన తెలంగాణ సీఎం కేసీఆర్.. రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చ
X

మూడు రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ సీఎం కేసీఆర్ బిజిబిజీగా గడుపుతున్నారు. కేంద్రమంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తున్న ఆయన ప్రధాని మోడీతోనూ సమావేశం అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన చట్టంలోని పలు అంశాలపై మోడీతో సీఎం కేసీఆర్‌ చర్చించినట్లు సమాచారం. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించడం, పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు సహకారం అందించడం, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు, జీఎస్టీ బకాయిలకు సంబంధించిన అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

అంతకుముందు కేంద్రం పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురిని కలిసిన సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ఆరు దేశీయ విమానాశ్రయాల అభివృద్ధికి సహకరించాలని కోరారు. రాష్ట్రంలోని బసంత్‌నగర్, మామునూరు, ఆదిలాబాద్, జాక్రాన్‌పల్లి, దేవరకద్ర, భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టులను అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇప్పటికే వీటికి సంబంధించిన డీపీఆర్‌లు తయారు చేశామని కేసీఆర్ వివరించారు. విమానాశ్రయాల ఏర్పాటుపై 2018లోనే ప్రతిపాదనలు కేంద్రానికి పంపినట్లు చెప్పారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇప్పటికే వీటి ఏర్పాటుపై సర్వే జరిపినట్లు వెల్లడించారు. దేశీయ విమానాశ్రయాల అభివృద్ధికి అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ విండో విధానంలో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story