తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం

తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు ఆమోదం
x
కేసీఆర్
Highlights

తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 320 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా దుమ్ముగూడెంలో గోదావరి...

తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 320 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా దుమ్ముగూడెంలో గోదావరి నదిపై బ్యారేజి నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్‌ మానేరు వరకూ 3 టీఎంసీల నీటిని తరలించడానికి నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. అలాగే, కేంద్రం నుంచి నిధులు రాకపోవడంతో బడ్జెట్ కేటాయింపులకు మించి ఏ శాఖలోనూ ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయొద్దని మంత్రులకు సీఎం సూచించారు. అన్ని శాఖలు విధిగా నియంత్రణ పాటించాల్సిందేనని , సరైన ఆర్థిక క్రమశిక్షణతోనే పరిస్థితిని ఎదుర్కోగలమని సీఎం కేసీఆర్ చెప్పారు. అదనపు ఆదాయం రాబట్టే అవకాశాలపై మంత్రివర్గంలో చర్చించారు కేసీఆర్.

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రగతి భవన్‌లో బుధవారం సాయంత్రం జరిగిన ఈ సమావేశం దాదాపు ఐదు గంటలపాటు కొనసాగింది. ఈ కేబినెట్ భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై ప్రధానంగా చర్చ జరిగింది. లోకాయుక్త చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్‌, ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ ఇటీవల ఇచ్చిన హామీలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు తదితర అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించారు. మున్సిపల్ ఎన్నికలపైనా చర్చించినట్టు తెలుస్తోంది.

320 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా దుమ్ముగూడెంలో గోదావరి నదిపై బ్యారేజి నిర్మించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. 3,482 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ బ్యారేజికి అయ్యే ఖర్చును రెండు సంవత్సరాల బడ్జెట్లలో కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దుమ్ముగూడెం వద్ద ఏడాదికి ఐదారు నెలల పాటు పుష్కలంగా నీటి లభ్యత ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో తక్కువ ఖర్చుతో విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. 37 టిఎంసిల నీటి నిల్వ సామర్థ్యంతో 63 మీటర్ల ఎత్తులో, భూసేకరణ అవసరం లేకుండా నదిలోనే నీళ్లు నిల్వ ఉండేలా బ్యారేజి నిర్మాణం చేపట్టవచ్చని అధికారులు తెలిపారు. ఈ ప్రతిపాదనను కేబినెట్ ఆమోదించింది.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు వరకు 3 టిఎంసిల నీటిని తరలించడానికి నిర్మాణాలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రస్తుతం నిర్మించిన ప్రాజెక్టు రోజుకు 2 టిఎంసిల నీటిని ఎత్తిపోయడానికి వీలుగా ఉంది. మేడిగడ్డ వద్ద గోదావరిలో పుష్కలమైన నీటి లభ్యత ఉన్నందున రోజుకు 3 టిఎంసిలను ఎత్తిపోసుకోవచ్చని అధికారులు ప్రతిపాదించారు. మిడ్ మానేరు వరకు 3వ టిఎంసిని ఎత్తిపోసే పనులను చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. రూ.11,806 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనులకు సంబంధించిన ఖర్చులను రెండేళ్ల బడ్జెట్లో కేటాయించాలని నిర్ణయించారు.

గ్రామాల్లో పచ్చదనం- పరిశుభ్రత వెల్లివిరిసేలా, ప్రజలందరి భాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు మార్చే దిశగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం- పల్లె ప్రగతి పురోగతిపై సమావేశంలో చర్చించారు. ప్రజల నుంచి గొప్ప స్పందన వచ్చిన ఈ కార్యక్రమం స్పూర్తిని కొనసాగించడంలో అధికారులు విఫలమయ్యారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెప్రగతి కార్యక్రమాన్ని కొనసాగించడానికి అవసరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదని పంచాయతి రాజ్ కార్యదర్శిని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి -కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, బకాయిలు తదితర ఆర్థిక విషయాలపై కేబినెట్ విస్తృతంగా చర్చించింది. నిధుల వినియోగంలో ఇప్పుడున్న లోటుపాట్లను సవరించుకునే విషయంపై కూడా చర్చించారు. అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులు తమ శాఖకు సంబంధించిన నిధుల వినియోగం విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, నిధుల వినియోగంలో నియంత్రణ పాటించాలని చెప్పారు సీఎం కేసీఆర్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories