BJP - Padayatra: కాసేపట్లో బీజేపీ ప్రజా సంగ్రామ పాదయాత్ర

Telangana BJP Chief Bandi Sanjay Praja Sangrama Padaytra Start Today  at Charminar Bhagyalakshmi Temple | Live News
x

 కాసేపట్లో బీజేపీ ప్రజా సంగ్రామ పాదయాత్ర

Highlights

BJP - Padayatra: మొదటి రెండు రోజులు హైదరాబాద్‌లోనే సంజయ్‌ పాదయాత్ర, చార్మినార్‌ నుంచి మెహిదీపట్నం వరకు తొలిరోజు పాదయాత్ర

BJP - Padayatra: కాసేపట్లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభం కానుంది. ఉద‌యం చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్న ఆయన.. ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతరం ఆల‌యం నుంచి తన యాత్రను ప్రారంభించనున్నారు. ఈ పాదయాత్రలో జాతీయ నాయకత్వాన్ని ప్రాధాన్యం ఇస్తూ ఇద్దరు జాతీయ ప్రధాన కార్యదర్శులు హాజరుకానున్నారు. బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ తో పాటు పలువురు బీజేపీ ప్రముఖులు పాల్గొననున్నారు. ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసిన కమలం తమ్ముళ్లు.. మొదటి 10రోజుల షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం నాలుగు విడతల్లో ఈ యాత్ర జరుగనుండగా.. మొదటి విడత యాత్ర అక్టోబర్‌ 2న హుజూరాబాద్‌లో ముగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

ఉదయం బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి సంజయ్‌ని బుల్లెట్ బైక్‌లు, అశ్వదళాలు, ఒంటెలు, డోలు వాయిద్యాలతో భారీ ర్యాలీగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకు తీసుకెళ్లనున్నారు. చార్మినార్‌ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద ప్రారంభోత్సవ సభలో టీ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ప్రసంగిస్తారు. అనంతరం ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తారు. తొలిరోజు 10కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగనుంది. చార్మినార్ దగ్గర మొదలై.. మదీన, అఫ్జల్ గంజ్, బేగంబజార్, మెజాంజాహీ మార్కెట్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకపూల్, మాసబ్‌ ట్యాంక్‌ మీదుగా.. మెహిదీపట్నం వరకు మెదటి రోజు బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి యాత్రగా బయల్దేరి.. మెహిదీపట్నం చేరుకోనున్నారు. రాత్రికి పుల్లారెడ్డి ఫార్మసీ కాలేజీలో బస చేస్తారు బండి సంజయ్.

ఇక.. రెండో రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. పుల్లారెడ్డి కాలేజీ నుంచి బయల్దేరి టోలీచౌకి, షేక్ పేట్, గోల్కొండ కోట, లంగ‌ర్ హౌజ్ మీదుగా రాత్రికి బాపుఘాట్ కు చేరుకుంటారు బండి సంజయ్‌. షేక్ పేటలోని సుక్కుభాయి స్కూల్లో లంచ్‌, బాపూఘాట్‌ వద్ద బండి సంజయ్‌ బస కోసం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. పాదయాత్ర విజయవంతం కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం 29 క‌మిటీల‌ను నియమించింది. యాత్ర ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు బండి సంజ‌య్ వెంట ఈ క‌మిటీ స‌భ్యులు ఉండ‌నున్నారు. పాద‌యాత్ర రూట్ మ్యాప్ తో పాటు భోజన సదుపాయాలు, బ‌స ఏర్పాట్లు చూసుకోనున్నారు. మరోవైపు.. పాదయాత్రలో జాతీయ నేతలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఇతర రాష్ట్రాల బీజేపీ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ‌, అవినీతి, కుటుంబ పాల‌న విముక్తికై పాదయాత్ర చేపడుతున్నట్టు ఇప్పటికే బండి సంజయ్‌ ప్రకటించారు. గత ఏడేళ్లలో కేసీఆర్ సర్కార్‌ తెలంగాణ ప్రజలకు చేసిందేమీలేదని, వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు తగిన బుద్ధి చెప్పేలా.. ప్రజలను ఏకం చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. పాదయాత్రలో పాల్గొనేందుకు వచ్చేవారికోసం రిజిస్ట్రేషన్‌ పద్ధతిని తీసుకొచ్చింది. ఇందుకోసం ప్రత్యేక కాల్‌ సెంటర్‌ ను కూడా ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు తమ అధ్యక్షుడి పాదయాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో బీజేపీ క్యాడర్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories