Supreme Court: బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి దక్కని ఊరట..

Supreme Court: తెలంగాణలో ఎన్నికల పంచాయితీ ఎటూ తేలడం లేదు. బీసీల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి నిరాశే ఎదురైంది.
Supreme Court: తెలంగాణలో ఎన్నికల పంచాయితీ ఎటూ తేలడం లేదు. బీసీల రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి నిరాశే ఎదురైంది. జీవో నెంబర్ 9పై హైకోర్టు విధించిన స్టే ఉత్తర్వులు ఎత్తివేయాలన్న పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్లు 50శాతం పరిమితికి లోబడే ఉండాలని స్పష్టం చేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 9పై హైకోర్టు ఈనెల 9న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో 13 వతేదీన S.L.P దాఖలు చేసింది. అత్యవసర పరిస్థితుల దృష్ట్యా 16, 17 తేదీల్లో ఏదో ఒకరోజు ఈ అంశంపై విచారించాలని మంగళవారం సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ముందు మెన్షన్ దాఖలు చేసింది. రిజిస్ట్రీ ఈ కేసును గురువారం విచారణ జాబితాలో చేర్చింది.
ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహెతాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్ అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా పకడ్బందీగా ఇంటింటికి తిరిగి సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించిందని తెలిపారు. శాస్త్రీయ ఎంపరికల్ డేటా సేకరించిందని తెలిపారు. డేటా ఆధారం రిజర్వేషన్లు పెంచే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని సింఘ్వీ కోర్టుకు విన్నవించారు.
ప్రతివాది తరపున న్యాయవాది మాధవరెడ్డి తన వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో రిజర్వేషన్లు 50శాతానికి మించి ఉండకూడదని స్పష్టం చేసిందన్నారు. ట్రిపుల్ టెస్ట్లో కూడా 50శాతం పరిమితికి లోబడే రిజర్వేషన్లు ఉండాలని తెలిపారు. కృష్ణమూర్తి కేసుతో సహా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో రిజర్వేషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించిందని చెప్పారు. తెలంగాణలో రిజర్వేషన్లను 50శాతానికి మించి పెంచడానికి వీలు లేదని తమ వాదనల్లో వినిపించారు.
వాదనలు విన్న ధర్మాసనం.... రిజర్వేషన్ల పెంపుపై తుది నిర్ణయం హైకోర్టులోనే తేల్చుకోవాలని స్పష్టం చేసింది. పాత రిజర్వేషనల్ ప్రకారమే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని ధర్మాసనం ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా ఈ కేసులో విచారణను కొనసాగించాలని హైకోర్టుకు సూచించింది.
సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్థత ఏర్పడింది. ప్రభుత్వం 50శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్తుందా...? కాంగ్రెస్ పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



