Srisailam Fire Accident: సీఐడీ విచార‌ణ‌కు సీఎం కేసీఆర్ ఆదేశం

Arun Chilukuri
Published on: 21 Aug 2020 4:06 PM IST
Srisailam Fire Accident: సీఐడీ విచార‌ణ‌కు సీఎం కేసీఆర్ ఆదేశం
X

Srisailam Fire Accident: శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిని అత్యంత దురదృష్టకరమైన సంఘటనగా పేర్కొన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారిని రక్షించడానికి చేసిన అన్ని ప్రయత్నాలు ఫలించకపోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సబ్యులకు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యం అందించాలని, పూర్తి ప్రభుత్వ ఖర్చుతో వైద్య చేయించాలని ఆయన అధికారులను ఆదేశించారు. సంఘటనా స్థలంలో ఉన్న విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీష్ రెడ్డి, ట్రాన్స్ కో – జెన్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు తో సీఎం ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

శ్రీశైలం పవర్ ప్లాంటులో జరిగిన ప్రమాదంపై సీఐడీ విచారణకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు వెలికి తీయాలని, ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు బయటకు రావాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సీఐడీ అడిషనల్ డి.జి.పి. గోవింద్ సింగ్ ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపి, ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story