
మైనింగ్ టూరింజపై సింగరేణి సంస్థ కీలక నిర్ణయం
Singareni: బొగ్గు గనులను టూరిజం స్పాట్స్గా మార్చబోతున్న సింగరేణి
Singareni: అసలు బొగ్గుగని ఎలా ఉంటుంది..? బొగ్గు గనుల నుంచి బొగ్గును ఎలా వెలికితీస్తారు..? భూగర్భం లోపల ఉన్న బొగ్గు గనిని చూడాలని అనుకుంటున్నారా..? ఫ్యామిలీతో ఓపెన్ కాస్ట్ గనుల్లోకి దిగాలనుందా..? అయితే.. సింగరేణిలో భూగర్భగని టూరిజం త్వరలోనే అందుబాటులోకి రానుంది. అంతే కాదు తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీని కూడా ప్రకటించబోతోంది.
సింగరేణి బొగ్గు గనుల తవ్వకాలను ప్రత్యక్షంగా చూడాలనుకునేవారికి ప్రభుత్వం శుభవార్త చెప్తోంది. త్వరలోనే సింగరేణి బొగ్గు గనులను ప్రజలు కళ్లారా చూడొచ్చని చెప్తోంది. బొగ్గు తవ్వకాల్లో రికార్డులు తిరగరాస్తున్న సింగరేణి గనులు ఇప్పుడు టూరిజానికి కేరాఫ్ అడ్రస్గా మారబోతున్నాయి. ఇప్పటి వరకూ బొగ్గు గనులు అసలు ఎలా ఉంటాయో దాంట్లో పనిచేసే కార్మికులకు తప్ప..సాధారణ ప్రజలకు అసలు తెలియదు. అందుకే వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ..తొలిసారిగా రామగుండంలోని ఓ గనిని పర్యాటక ప్రాంతంగా మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టూరిజం మైన్గా..మూతపడిన 7Lప్ అండర్ గ్రౌండ్ మైన్ను సెలెక్ట్ చేసింది సింగరేణి యాజమాన్యం.
అయితే బొగ్గు గనుల్లో సురక్షితంగా ఉండే కొంత ప్రాంతాన్ని ఎంచుకుని దానికి మెరుగులు దిద్దుతున్నారు అధికారులు. బొగ్గు బావుల్లో బొగ్గు తీసేటప్పుడు ఎలాంటి వాతావరణం ఉంటుంది..? గని లోపల బొగ్గు పొరలు ఎలా ఉంటాయి..? ఎలాంటి టెక్నాలజిని వాడుతున్నారనే దానిపై పర్యాటకులకు అర్ధం అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గని లోపల కార్మికులు పనిచేసే చోటును చూడడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నప్పటికీ మైనింగ్ నిబంధనలు అనుకూలించవు. అలాంటి వారి కోసమే ఈ అండర్ గ్రౌండ్ మైన్ సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు..సౌకర్యాల కల్పనపై కేంద్ర బొగ్గు గనుల శాఖ ఆదేశాల మేరకు సింగరేణి సంస్థ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అంతా అనుకున్నట్లు జరిగితే త్వరలోనే సింగరేణి ఓ పర్యాటక ప్రాంతంగా మారబోతోంది అనడంలో ఎలాంటి సందేహంలేదు.
ఇలాంటివి ఇప్పటికే కోలిండియా పరిధిలోని మహారాష్ట్రలో వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్, ఝర్ఘండ్లోని ధన్బాద్, మధ్య ప్రదేశ్లోని సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ వంటి మూసేసిన గనులను టూరిజం స్పాట్స్ గా అభివృద్ధి చేశారు. పర్యాటక ప్రాంతాలుగా ఇవన్నీ విజయవంతంగా నడుస్తున్నాయి. ఇప్పుడు మొదటిసారిగా తెలుగు ప్రజలకు గోదావరిఖని అందుబాటులోకి రాబోతుంది. ఇందుకోసం తెలంగాణ ఆర్టీసీ కూడా స్పెషల్ బస్సు సర్వీసులను ఏర్పాటు చేస్తోంది. ఈ కోల్ మైన్ టూరిజంను దృష్టిలో పెట్టుకుని స్పెషల్ ప్యాకేజీ టూర్లను ప్రకటించబోతుంది టీఎస్ ఆర్టీసీ.
సింగరేణి చరిత్రలో బొగ్గు గనని వెలికితీసే ప్రక్రియను ప్రజలకు చూపించే అవకాశాన్ని కల్పించడం నిజంగా గర్వించదగ్గ విషయం. ఈ నిర్ణయం వల్ల సింగరేణి కార్మికులు బొగ్గుగనుల్లో పడే కష్టం..అసలు బొగ్గును ఎలా వెలికితీస్తారు అనేది ప్రజలకు అవగాహన కలుగుతుంది. దీనివల్ల అటు సింగరేణిని ఇటు ఆర్టీసీకి కొత్త ఆదాయ మార్గంగా చాలా ఉపయోగపడుతుందనే చెప్పాలి. ఎంతో మందికి కొత్త ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




