Lagcherla Farmer: రైతు హీర్యా నాయక్ కి బేడీల కేసు విచారణలో సంచలన విషయాలు

Lagcherla Farmer: సంగారెడ్డి సెంట్రల్ జైలులో రైతు హీర్యా నాయక్(Heerya Naik) కు బేడీలు వేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీయండంతో అధికారులు అలెర్ట్ అయ్యారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 13 Dec 2024 7:32 AM IST
Sensational Details Emerge in the Farmer Heerya Naik Handcuffed Case
X

Lagcherla Farmer: రైతు హీర్యా నాయక్ కి బేడీల కేసు విచారణలో సంచలన విషయాలు

Lagcherla Farmer: సంగారెడ్డి సెంట్రల్ జైలులో రైతు హీర్యా నాయక్(Heerya Naik) కు బేడీలు వేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీయండంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. రాజకీయంగా కూడా తీవ్ర దూమరం రేపడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. రైతు హీర్యానాయక్‌కు బేడీలు వేసిన ఘటనపై ఉన్నతాధికారుల విచారణ చేపట్టారు. వికారాబాద్‌, సంగారెడ్డి జిల్లాల ఎస్పీలతో కలిసి ఐజీ సత్యనారాయణ నాలుగు గంటల పాటు జైలు సిబ్బందిని విచారించారు. సంగారెడ్డి సెంట్రల్‌ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేయాల్సివచ్చిందని ఐజీ సత్యనారాయణ తెలిపారు.

హీర్యానాయక్‌ను జైలు నుంచి ఆస్పత్రికి తరలించే క్రమంలో జైలు అధికారులు ముందస్తుగా వికారాబాద్‌(Vikarabad) పోలీసులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని ఐజీ తెలిపారు. నేరుగా సైబరాబాద్‌ పోలీసులకు మాత్రమే సమాచారం ఇచ్చారన్నారు. మరోవైపు, హీర్యానాయక్‌ను లగచర్ల కేసులో నిందితుడిగా పేర్కొనలేదని బాలానగర్‌లోని ఓ కేసులో నిందితుడిగా ఉన్నాడని చెప్పారు. ఉద్దేశపూర్వకంగా చేశారా లేక పొరపాటు జరిగిందా అనే కోణంలో పూర్తిస్థాయిలో విచారణ చేశామని ఐజీ సత్యనారాయణ తెలిపారు.

లగచర్ల కేసులో ఏ2గా ఉన్న సురేశ్‌ జైలు నుంచి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడారు. హీర్యానాయక్‌కు గుండె నొప్పి అని చెబితే బెయిల్‌ వస్తుందని సురేశ్‌ చెప్పాడు. సురేశ్‌ ఎవరితో మాట్లాడారనే దానిపై ఆరా తీస్తున్నామని ఐజీ తెలిపారు. హీర్యానాయక్‌కు బేడీలు వేసిన ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్‌ సంజీవరెడ్డిని సస్పెండ్‌ చేస్తూ జైళ్లశాఖ డీజీ సౌమ్యమిశ్రా ఆదేశాలు జారీ చేశారు.

లగచర్ల దాడి ఘటనలో గత 30 రోజుల నుంచి 45 మంది రైతులు సంగారెడ్డి జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే హీర్యా నాయక్ కు గుండెపోటు వచ్చింది. బాధిత రైతుకు సంకెళ్లు వేసి ఆస్పత్రికి తరలించడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) సీరియస్ అయ్యారు. బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story