Schools Reopen: తెలంగాణలో తెరుచుకోనున్న పాఠశాలలు

Schools Reopen In Telangana From Today
x

తెలంగాణలో నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం (ఫైల్ ఇమేజ్)

Highlights

Schools Reopen: ఇవాళ్టి నుంచి స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యక్ష బోధన

Schools Reopen: తెలంగాణలో ఇవాళ్టి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో గురుకులాలు మినహా మిగతా పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్కూళ్లు తెరవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. హై కోర్టు ఇచ్చిన ఈ మధ్యంతర ఉత్తర్వులపై అడ్వకేట్‌ జనరల్‌తో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇతర ఉన్నతాధికారులు చర్చించి హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సవరణలు చేస్తూ ఇవాళ్టి నుంచే తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం గురుకుల విద్యాలయాలు మినహాయించి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కేజీ నుంచి పీజీ వరకు, అంగన్‌ వాడీ మొదలు అన్ని పాఠశాలల్లో గతంలో నిర్ణయించిన మాదిరిగానే నేటి నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభించాలని నిర్ణయించారు.

గురుకులాల్లో మాత్రం హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయాన్ని వాయిదా వేశారు. విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు కచ్చితంగా హాజరు కావాలని బలవంతపెట్టొద్దని ఆదేశిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తిగా ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలా? లేక ఆన్‌లైన్‌లో కొనసాగించాలా? అనే స్వేచ్ఛ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అయితే.. పాఠశాలకు విద్యార్థులను పంపించాలి, కానీ అక్కడ ఏమైనా జరిగితే తమ బాధ్యత కాదని కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ఒప్పంద పత్రాలు తీసుకుంటున్న నేపథ్యంలో దానిపై కూడా విద్యాశాఖ అధికారులు చర్చించారు. అలాంటి పత్రాలకు ఎలాంటి చట్ట బద్ధత ఉండదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రత్యక్ష బోధన నిర్వహించే విద్యాసంస్థలు ఎలాంటి నిబంధనలు అనుసరించాలనే దానిపై వారం రోజుల్లో పూర్తి స్థాయి విధివిధానాలు ఖరారు చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను మంత్రి ఆదేశించారు.

అయితే.. కరోనా భయం పూర్తిగా వీడకపోవడంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పాఠశాలలకు పంపిస్తారా..? లేక ఆన్ లైన్ క్లాసులకే పరిమితం చేస్తారా అన్న సందేహాలు వ్యక్త మవుతున్నాయి. యాజమాన్యాలు స్కూళ్లల్లో కరోనా నిబంధనలు పక్కాగా అమలు చేస్తాయా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాశాలల్లో పాటించాల్సిన కొవిడ్‌ నిబంధనలపై గతంలోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా.. అవి ఏ మేరకు అమలవుతాయన్న దానిపై పిల్లల తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు కేసులు పూర్తి స్థాయిలో తగ్గకపోవడం.. మరోవైపు థర్డ్‌వేవ్‌ పై ఐసీఎంఆర్‌ తాజా ప్రకటనల నేపథ్యంలో పిల్లల్ని పాఠశాలలకు పంపే విషయంలో పేరెంట్స్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. తరగతి గదుల్లో కోవిడ్ నిబంధనలు పక్కాగా అమలు అవుతాయా..? క్లాస్ రూముల్లో భౌతిక దూరం పాటించడం సాధ్యమేనా..? శానిటైజేషన్ ఎప్పటికప్పుడు చేస్తారా..? అనే సందేహాలు తల్లిదండ్రులను వెంటాడుతున్నాయి. ఇక స్కూల్ బస్సుల్లో వచ్చే పిల్లల పరిస్థితి ఏంటన్నది మరో ప్రశ్న. మొత్తం మీద ఇలాంటి అనేక సందేహాలు, ఆందోళనల నడుమ పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories