పై తరగతులకే ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు.. పదోన్నతి రెండేండ్లకే..

Arun Chilukuri
Updated on: 12 Jan 2021 9:22 AM IST
Schools for Class 9 and above to re-open from Feb 1 in Telangana
X

సీఎం కేసీఆర్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫిబ్రవరి నుంచి స్కూల్స్‌ ఓపెన్‌ చేయాలంటూ విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా మార్పులు, చేర్పులు చేసి ధరణి పోర్టల్‌ను విజయవంతం చేయాలంటూ రెవెన్యూ శాఖకు పలు సూచనలు చేశారు. అటు వేతనాలు, పదోన్నతుల విషయంలో ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ చెప్పారు.

తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతోపాటు భూముల రిజిస్ట్రేషన్‌పై సీఎం కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో రెవెన్యూ, పంచాయతిరాజ్‌, మున్సిపల్‌, వైద్య శాఖలతోపాటు ఇతర శాఖల్లోని ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక అదేవిధంగా కరోనా వ్యాక్సినేషన్‌ పంపిణీపై రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

తెలంగాణ ఉద్యోగులకు సీఎం కేసీఆర్‌ మరో తీపికబురు అందించారు. కొత్త ఏడాది కానుకగా వేతనాలు పెంచడంతోపాటు పదోన్నతుల కోసం ఉద్యోగుల కనీస సర్వీసును మూడేళ్ల నుంచి రెండేళ్లకు కుదిస్తూ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు, తక్కువ వేతనాలున్న ఆర్టీసీ సిబ్బందికి, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు పెంపు వర్తిస్తుందని చెప్పారు. హోంగార్డులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, విద్యా వలంటీర్ల మాదిరి గౌరవ వేతనాలు అందుకుంటున్న వారందరికీ, పెన్షనర్లకు ఇలా అందరికీ వేతనాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈమేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తొమ్మిదో తరగతి, ఆపైన తరగతులకు క్లాసులు నిర్వహించాలన్నారు. ఇక వీలైతే సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే 18 లేదా 20వ తేదీ నుంచి తరగతులను ప్రారంభిస్తామని విద్యాశాఖ సీఎంకు వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, కరోనా వ్యాక్సినేషన్‌ కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభించాలన్నారు సీఎం కేసీఆర్‌.

అటు రెవెన్యూ శాఖకు సంబంధించిన అన్నిరకాల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌లో అవసరమైన అన్నిరకాల మార్పులు, చేర్పులను వారం రోజుల్లోగా పూర్తి చేయాలన్నారు. అన్నిశాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని, ఖాళీలన్నీ ఒకేసారి వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలో అడవుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పట్టణాల్లో జనాభాకు అనుగుణంగా సమీకృత మార్కెట్లు, వైకుంఠ ధామాలు నిర్మించాలని ఆదేశించారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story