Corona Second Wave: బ్లాక్ మార్కెట్లో రెమిడిసివర్ దందా

Corona Second Wave: కోవిడ్ విజృంభణ చూస్తుండగానే తారస్థాయికి చేరుకుంటుంది.

Samba Siva Rao
Updated on: 20 April 2021 5:28 PM IST
Remdesivir Vaccine
X
రెండేసివిర్ ఫైల్ ఫోటో 

Corona Second Wave: కోవిడ్ విజృంభణ చూస్తుండగానే తారస్థాయికి చేరుకుంటుంది. సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రతరం కవడంతో అధిక సంఖ్యలో కోవిడ్ బారిన పడుతున్నారు. అధికంగా లంగ్స్ ఇన్‌ఫెక్షన్ కావడంతో మరణాల సంఖ్య భారీగానే పెరుగుతోంది. ఇక వెంటిలేటర్స్ పై చికిత్స పొందుతూ కొన ఊపిరితో ఉన్నవారిని రక్షించేందుకు ఉపయోగించే రెమిడిసివర్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్నారు.

కోవిడ్ బాధితుల ప్రాణదాత అయిన రెమిడిసివర్ దొరకటం కష్టతరంగా మారింది. కరోనా చికిత్సకు అత్యంత కీలమైన రెమిడిసివర్ ఇంజెక్షన్లు పేద, మధ్య తరగతి ప్రజలకు దొరకకపోవడంతో ఆసుపత్రుల్లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. కూకట్‌పల్లి వై జంక్షన్ దగ్గర వ్యాక్సిన్‌ కోసం ఉదయం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు ఎదురు చూస్తున్నారు. తమ వారిని కాపాడుకునేందుకు గంటల కొద్దీ ఎదురుచూస్తున్నారు. కొంత మంది లైన్లలోనే నీరసంతో కుప్పకూలి పోతున్నారు అయిన వారికి ఇంజెక్షన్ దొరుకుతుంది అనే గ్యారింటిలేదు.

రెమిడిసివర్ ఇంజెక్షన్ రిటైల్ మార్కెట్ లో రూ.2,600 ఉంది. ఈ ఇంజెక్షన్ ఆసుపత్రిలో 3,500కి లభిస్తోంది. ఒక్కో కరోనా రోగికి ఆరు ఇంజెక్షన్లు కోర్సుగా వాడాల్సి ఉంటుంది. దీంతో కరోనా వచ్చిన రోగులు అందరికి ఆసుపత్రిలో చికిత్స కోసం దీన్ని తప్పనిసరిగా వాడుతున్నారు. గత రెండు వారాల నుంచి కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. చాలా వేగంగా వైరస్‌ విస్తరిస్తోంది. అయితే కరోనా చికిత్సకు అత్యంత కీలకమైన రెమిడిసివర్‌ ఇంజెక్షన్లు మాత్రం అందుబాటులోకి రావడం లేదు.

రెమిడిసివర్‌ అందుబాటులో లేకపోవడంతో పాటు.. డిమాండ్‌ కూడా పెరగడంతో రోగుల అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు కార్పొరేట్‌ ఆస్పత్రులు.. కొన్ని ఫార్మా కంపెనీలు.. అలాగే డీలర్లు రంగంలోకి దిగుతున్నారు. కృత్రిమ కొరత సృష్టిస్తున్నారని ప్రజలు మండిపడుతన్నారు.

రెమిడిసివర్‌ను బహిరంగ మార్కెట్ లో విక్రయించవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. దీంతో కరోనా చికిత్సకు అనుమతించిన ఆసుపత్రులకు అత్యధికంగా హెటిరో డీలర్ నుంచే మేజర్ షేర్ సరఫరా అవుతోంది. మార్కెట్‌లో ఇంకా మరో 5 కంపెనీల నుంచి ఈ ఇంజెక్షన్ వచ్చినా సరఫరా అనుకున్న మేర అందుబాటులోకి రాలేదు. రోజుకి 50 వేల ఇంజెక్షన్ల డిమాండ్ ఉంటే 5 వేల ఇంజెక్షన్లు మాత్రమే సరఫరా అవుతున్నయి తెలుస్తోంది. అయితే.. వీటిని బ్లాక్‌లో ఒక్కో ఇంజెక్షన్ ని 10 నుంచి 20 వేలకు అమ్మకాలు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారనేది ఆరోపణలు ఉన్నాయి.

మొదటి దశ కరోనా సమయంలో రెమిడిసివర్‌ ఇంజెక్షన్ల ఉత్పత్తి ఎక్కువగా ఉండేదని.. అయితే ఆ స్థాయిలో సెకండ్‌ వేవ్‌ కరోనా టైమ్‌కు ఇటు ప్రభుత్వం కానీ, అటు ఫార్మా కంపెనీలు కానీ సిద్దం కాకపోవడం వల్ల ఈ తరహాలో డిమాండ్‌-సప్లై మధ్య పెద్ద ఎత్తున గ్యాప్‌ వచ్చి బ్లాక్‌ మార్కెట్టుకు ఆస్కారం ఏర్పడుతోందని పలువురు విమర్శిస్తున్నారు..

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెమిడిసివర్ ఉత్పత్తి పెంచాలని బ్లాక్ లో అమ్మకుండా ధరలు తగ్గించినా ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. ఇప్పటికైనా త్వరితగతిన సమస్యను నిర్మిలించి కొవిడ్ బాధితులను కాపాడలని ప్రజలు కోరుతున్నారు.

Samba Siva Rao

Samba Siva Rao

Next Story