Telangana Liquor: జోరుగా మ‌ద్యం అమ్మ‌కాలు..'ఫుల్' జోష్‌( కిక్కు)

Telangana Liquor: కొందరికీ చుక్క పడందే ముద్ద దిగదు. మరికొందరికైతే నిద్రనే పట్టదు. ఇంకొందరికైతే అసలు ఒళ్లే సహకరించదు.

Arun Chilukuri
Updated on: 13 May 2021 2:26 PM IST
Record Sale of Liquor in Telangana
X

Telangana: జోరుగా మ‌ద్యం అమ్మ‌కాలు..'ఫుల్' జోష్‌( కిక్కు)

Telangana Liquor: కొందరికీ చుక్క పడందే ముద్ద దిగదు. మరికొందరికైతే నిద్రనే పట్టదు. ఇంకొందరికైతే అసలు ఒళ్లే సహకరించదు. పాపం గత ఏడాది సడన్‌గా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో మద్యంప్రియులు కంగుతున్నారు. లాక్‌డౌన్‌ పొడగిస్తూ పోతుంటే ప్రాణం తీసేసినంత పానైంది. ఇప్పుడు మళ్లీ ప్రభుత్వం లాక్‌డౌన్‌ అనగానే మందుబాబులు అలెర్ట్ అయ్యారు. దగ్గరలో ఎక్కడ వైన్స్ ఉంటే అక్కడ వాలిపోయారు. కట్‌ చేస్తే ఎక్సైజ్‌ అధికారులే అవాక్కయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏకంగా 125 కోట్ల అమ్మకాలు జరిగాయట.

తెలంగాణలో లాక్‌డౌన్‌ తొలిరోజు కూడా మద్యం అమ్మకాలు జోరందుకున్నాయి. మద్యం షాపులు కేవలం 4గంటలు మాత్రమే తెరిచి ఉంచారు. ఆ కొద్దీ టైంను కూడా మద్యం ప్రియులు సద్వినియోగం చేసుకున్నారు. ఉదయం 6గంటలకు వైన్స్ తెరవగానే మందుబాబులు నిద్రమత్తులోనే స్పాట్‌కు చేరుకున్నారు. కావాల్సిన సరుకు తీసుకొని ఇంటిబాట పట్టారు. రాష్ట్రంలో 4గంటల్లోనే 98 కోట్ల అమ్మకాలు జరిగాయంటే మందుబాబులకు ఎంత మందుచూపో అర్థం చేసుకోవచ్చు.

ప్రాణాలకు ప్రమాదం వచ్చింది. మనిషి మరో మనిషిని కలవొద్దని ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. కానీ మద్యంప్రియులు ఇవేవి పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించకముందే మద్యంప్రియులు పరుగు పరుగున వైన్‌షాపుల ముందు వాలిపోయారు. మద్యం బాటిళ్ల కోసం ఎగబడ్డారు. నచ్చిన బ్రాండ్స్‌ పక్కన పెట్టి ఏది దొరికితే అది చంకన పెట్టుకొని ఇంటిబాట పట్టారు.

గత లాక్‌డౌన్‌ నేర్పిన పాఠం అనుకుంటా మందుబాబులు ముందుజాగ్రత్త పడ్డారు. వాళ్ల మందు చూపు బాగానే ఉంది. కానీ కరోనా రూల్స్‌ని గాలికి వదిలేశారు. సోషల్‌ డిస్టెన్స్‌కు పాతర వేశారు. క్యూలైన్లలో కిక్కిరిసిపోయారు. ఒకరినొకరు హత్తుకున్నట్లే నిలబడిపోయారు. ఇక కరోనా కామ్‌గా ఉంటుందా దొరికినవారిని దొరికినట్లు టచ్‌ చేసే ఉంటుంది.

లాక్‌డౌన్‌ టైంలోనూ మద్యం విక్రయాలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల మధ్య మాత్రమే వైన్‌ షాపులు, బార్‌, రెస్టారెంట్‌లు తెరుచుకోవచ్చని స్పష్టం చేసింది. మద్యం విక్రయించే సమయంలో కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. వైన్స్‌ షాపుల పక్కనే ఉండే పర్మిట్‌ రూమ్స్‌ కి తాళాలు పడాలని ఖరకండిగా చెప్పేసింది.

గత లాక్‌డౌన్‌ సమయంలోనే తాము తీవ్రంగా నష్టపోయామని, లైసెన్సు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితుల్లోకి వెళ్లామంటున్నారు బార్ల నిర్వాహకులు. దీంతో బార్ల నుంచి కూడా మద్యాన్ని రిటైల్‌గా అమ్ముకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే వైన్‌ షాపులు బంద్‌ చేసిన తర్వాత బార్ల నుంచి డోర్‌ డెలివరీకి అనుమతివ్వాలని నిర్వాహకులు కోరుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story