
Rain: హైదరాబాద్లో ముసురు.. రోడ్లపై నిలిచిన నీరు... ట్రాఫిక్ జామ్
Rain: మరో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ
Rain: తెలంగాణలో ఇప్పటికే వర్షాలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్లో నిన్న ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా విస్తారంగా వానలు పడుతుండగా.. పలు జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురిశాయి. ఇవాళ కూడా హైదరాబాద్లో స్వల్ప వర్షం పడనుండగా... పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ఇవాళ ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడతాయని హెచ్చరిస్తూ వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందని తెలిపింది. కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇక రేపు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు అతి భారీ వర్షసూచన వాతావరణశాఖ అధికారులు జారీ చేశారు. రేపు హనుమకొండ, వరంగల్, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, జనగాం, మహబూబాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది.
వర్షం కారణంగా భూపాలపల్లిలో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో 8 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ములుగు జిల్లావ్యాప్తంగా 8.54 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, కొన్నాయిగూడెంలో అత్యధికంగా 9.84 సెంటీమీటర్లు కురిసింది. బొగత జలపాతం వద్దకు పర్యాటకుల సందర్శనను ఫారెస్ట్ అధికారులు నిలిపివేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
మిడ్మానేరు డ్యామ్కు వరద ప్రవాహం పెరుగుతోంది. 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. లోయర్ మానేరు ప్రాజెక్ట్కు వరద ప్రవాహం పెరిగింది. ఇటు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్కు వరద ప్రవాహం కొనసాగుతోంది. మంచిర్యాల జిల్లాలో రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీరాంపూర్, ఇందారం, మందమర్రి, ఆర్కేపీ,..
కైరిగూడ ఓసీపీలో 80వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. 2లక్షల 44వేల టన్నుల ఓబీ పనులను సింగరేణి అధికారులు నిలిపివేశారు.
అతి భారీ వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, నీళ్లు చేరుకునే అవకాశముందని అధికారులు తెలిపారు. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగే అవకాశముందని చెప్పారు. నిన్న ములుగు జిల్లాలోని వెంకటాపూర్లో 92.5 మిల్లీమీటర్లు, తడ్వాయిలో 92.2 మిల్లీమీటర్లు, ఏటూరునాగారంలో 89.4 మిల్లీమీటర్లు, గోవిందరాంపేటలో 87 మిల్లీమీటర్లు, వెంకటాపురంలో 85.2 మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు విస్తరించినా.. మొన్నటివరకు వర్షం పడలేదు. దీంతో లోటు వర్షపాతం నమోదైంది. కానీ ఈ నెల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇటు ఏపీలోనూ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కోస్తాలో కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వానలు పడ్డాయి. ఇవాళ కూడా కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. మిగతా ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు కోరారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




