ప్రైవేటీకరిస్తే లాభనష్టాలు ఎలా ఉంటాయ్‌... ప్రైవేటు బస్సులు రోడ్డెక్కితే మారే పరిస్థితులేంటి?

ప్రైవేటీకరిస్తే లాభనష్టాలు ఎలా ఉంటాయ్‌... ప్రైవేటు బస్సులు రోడ్డెక్కితే మారే పరిస్థితులేంటి?
x
Highlights

ప్రభుత్వం మెట్టు దిగాలని కార్మికులు ఆర్టీసీయే దారికి రావాలని పాలకులు ఇలా ఎవరికి వారు పంతాలు పట్టింపులకు వెళ్తున్నారు. ఇక్కడో విషయం క్లియర్‌గా అర్థం...

ప్రభుత్వం మెట్టు దిగాలని కార్మికులు ఆర్టీసీయే దారికి రావాలని పాలకులు ఇలా ఎవరికి వారు పంతాలు పట్టింపులకు వెళ్తున్నారు. ఇక్కడో విషయం క్లియర్‌గా అర్థం అవుతుంది. ముఖ్యమంత్రి మొన్నటి ప్రెస్‌మీట్‌లో చెప్పినదైనా మంత్రులు చెబుతున్నదైనా అధికారులు అంటున్నదైనా ఎవరెన్ని రకాలుగా చెబుతున్న ఆర్టీసీ ప్రైవేటీకరణ తప్పదనే సంకేతాలే కనిపిస్తున్నాయి. దీనిపై మంత్రిమండలి కూచొని నిర్ణయం తీసుకునే విధంగా నేడు కేబినెట్‌ భేటీ కూడా జరగబోతోంది. ఇందులో ఆర్టీసీ ప్రైవేటీకరణ అనే విషయం లాంఛనప్రాయమే కానుంది. నిన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఉన్నతాధికారలతో నిర్వహించిన సమీక్షలో కూడా ఆర్టీసీపై భవితవ్యంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది.

ఇక్కడ ఒకే ఒక్క విషయం గురించి కాస్త లోతుగా చర్చించాల్సిన అవసరం ఉంది. ఇటీవలే మంత్రిగా పువ్వాడ అజయ్‌ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత అసెంబ్లీలో ఒక మాట చెప్పారు. హైదరాబాద్‌ నగరంలో తిరిగే బస్సులు పల్లెవెలుగు బస్సులు అంటే గ్రామీణ ప్రాంతాలకు నడిచే సర్వీసుల కారణంగా ఆర్టీసీ నష్టాలు చవిచూస్తుందని నిండు సభలో ఆయన చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా తిరుగుతున్న బస్సుల్లో 70 శాతం రూట్లు హైదరాబాద్‌, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సులే ఎక్కువ. మిగతా 30 శాతం రూట్లలో తిరుగుతున్న బస్సుల నుంచి లాభాలు వస్తున్నాయన్నది అజయ్‌ చెబుతున్న మాట. ఇప్పడు ఇదే విషయంపై చాలా మందికి చాలా అనుమానాలున్నాయి.

70 శాతం రూట్లు నష్టాల్లో ఉన్నాయన్నది రవాణ మంత్రి పువ్వాడ అజయ్‌ చెబుతున్న మాట. 70 శాతం రూట్లలో బస్సులు నష్టాల బాటలో నడుస్తున్నాయి. ఈ మార్గాల్లో గ్రామీణ ప్రాంతాలు, హైదరాబాద్‌ నగర దారులే ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన చూస్తుంటే 70 శాతం రూట్లనే ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుందన్న విషయం ఖాయంగానే కనిపిస్తుంది. లేక లాభాల్లో ఉన్న 30 శాతం బస్సు రూట్లను ప్రైవేటు ఆపరేటర్లకు ఇచ్చి ఆర్టీసీని మరింత పాతాళంలోకి నెట్టేస్తారా? అన్న అనుమానాలు తెలంగాణ ప్రజలను వెంటాడుతున్నాయి.

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పిన దాని ప్రకారం 30 శాతం అద్దె బస్సులు, 20 శాతం ప్రైవేటు ఆపరేటర్లకు ఇస్తే మిగిలిన 50 శాతం ఆర్టీసీకి కేటాయిస్తారన్న విషయం అర్థమవుతుంది. ఆయన మాటలను బట్టి చూస్తే 20 శాతం రూట్లలో ఎన్ని లాభాలు వస్తాయి ఎంత నష్టం వస్తుందన్న దానిపై ఆర్టీసీ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. అధికారిక లెక్కల ప్రకారం తెలంగాణలో మొత్తం 6 వేల 500 రూట్లు ఉన్నాయి. ముఖ్యమంత్రి చెప్పిన లెక్కలనే ప్రామాణికంగా తీసుకుందాం. 20 శాతం అంటే 1300 రూట్లు ప్రైవేటుపరం కానున్నాయని అనుకుందాం. ఇందులో కూడా లాభాలు వచ్చేవి ఎన్ని.. నష్టాలు తెచ్చేవి ఎన్ని అన్న దానిపై క్లారిటీ లేదు. ఇక్కడో అనుమానం కూడా ఉంది. నష్టాలు తెస్తున్న రూట్లనే ప్రైవేటుపరం చేస్తారా? లేక లాభాల్లో ఉన్న వాటిని ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగిస్తారా? అన్న దానిపై స్పష్టత కనిపించడం లేదు.

రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌ మాటలను బట్టి చూస్తుంటే హైదరాబాద్‌ రూట్లు, గ్రామీణ ప్రాంతాల రూట్లే ప్రైవేటుపరం చేయాలి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ప్రయాణికులు ఉన్నా లేకున్నా అవి తమ పని తాము చేసుకుపోవాల్సిందే. ఇక హైదరాబాద్‌ విషయానికొస్తే ఇక్కడ అడుగడుగుకో సిగ్నల్‌.... ట్రాఫిక్‌ జామ్‌లు. దీని వల్ల కూడా ఆర్టీసీకి నష్టాలు తప్పడం లేదు. సో ఏ లెక్కన చూసుకున్నా హైదరాబాద్‌ రూట్లు, పల్లె వెలుగు బస్సులు తిరిగే ప్రాంతాలు ప్రైవేటుపరం కానున్నట్టు కనిపిస్తుంది.

దీనిపై మరింత క్లారిటీగా మాట్లాడుకుందాం. ప్రైవేటు ఆపరేటర్ల విషయానికొస్తే అది ఆర్‌టీఏ అంటే రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఆధీనంలోకి వస్తుంది. ఇప్పటికే ఆ శాఖలో అధికారులు, సిబ్బంది కొరత వెంటాడుతోంది. అధికారులు చెబుతున్న మాట ప్రకారం తెలంగాణలోని అన్ని ప్రధాన రూట్లలో ఒకేసారి అన్ని బస్సులు వచ్చి పడితే పరిస్థితి ఏంటి? రవాణా వ్యవస్థ అంటే ప్రజల భద్రతకు సంబంధించిన వ్యవస్థ. అది ఆర్టీఏ అధికారుల సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఒక్కసారిగా వేలాది ప్రైవేటు బస్సులు తిరిగితే వాటి ఫిట్‌నెస్‌ విషయమే కానీ, డ్రైవర్లు నైపుణ్యాన్ని పరీక్షించేది ఎవరు.? ఇక్కడే ఇంకో అనుమానం కూడా వస్తుంది. ప్రభుత్వం ఎంపిక చేసిన రూట్లు ప్రైవేటుపరమవుతే అందులో ఆర్టీసీ ఛార్జీలే వర్తిస్తాయా? లేక ప్రైవేటు ఆపరేటర్లు సొంతంగా ధరలు నిర్ణయించుకుంటారా? బస్‌పాస్‌లను ప్రైవేటు బస్సుల్లో అనుమతిస్తారా? ఇవన్నీ విషయాలపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది.

ప్రస్తుతం ఆర్టీఏలో వేలాది ఖాళీలను భర్తీ చేయాలి. సిబ్బంది కొరత ఆ శాఖను వేధిస్తోంది. లైసెన్స్ జారీ, అనుమతుల జారీ, వాహన ఫిట్‌నెస్ వంటి పనులను పర్యవేక్షించడం కష్టమవుతుంది. ఈ నిబంధనలను ప్రభుత్వం మెరుగ్గా అమలు చేయడానికి వివిధ స్థాయిలలో అదనపు సిబ్బంది అవసరం. కొత్త ప్రతిపాదనను వచ్చిన తర్వాత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నా ఒకేసారి ఇన్ని వాహనాలు రోడ్డెక్కితే మాత్రం ఆర్‌టీఏకు తలకు మించిన భారం అవక తప్పదు. రోడ్డుపై తిరిగే ప్రతీ వాహనంతో ఆర్టీఏకే సంబంధం ఉంటుంది. అలాంటి ప్రైవేటు రూట్లలో బస్సులను తనిఖీ చేయాలంటే దానికి తగ్గట్టుగా సిబ్బందిని నియమించుకోవాలి. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఆరునెలల సమయం పడుతుంది.

ఆర్టీసీలో అంతర్గత వ్యవస్థ ఉంటుంది. చెక్ మెకానిజం నుంచి... డ్రైవర్లకు శిక్షణ లాంటి విషయాలన్నీ లోలోపలే నడిచిపోతుంటాయి. ఇప్పుడు ప్రైవేటు పరం చేస్తే ఇదంతా ఆర్టీఏ పరిధిలోకి వస్తుందా... లేదా అన్న అనుమానం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories