గ్రేటర్‌ జంపింగ్‌ క్యూలో ఇంకా ఎవరెవరు?

గ్రేటర్‌ జంపింగ్‌ క్యూలో ఇంకా ఎవరెవరు?
x
Highlights

సమయం లేదు మిత్రమా...పార్టీ మారతావా...అక్కడే నలిగిపోతావా...? ఇదిగో బంపర్ ఆఫర్....ఆలోచించినా ఆశాభంగం....త్వరపడండి...ఇప్పటికిప్పుడు గోడ దూకారంటే...

సమయం లేదు మిత్రమా...పార్టీ మారతావా...అక్కడే నలిగిపోతావా...? ఇదిగో బంపర్ ఆఫర్....ఆలోచించినా ఆశాభంగం....త్వరపడండి...ఇప్పటికిప్పుడు గోడ దూకారంటే ఓకే....ఒక్కరోజు ఆలస్యమైనా బతుకు బస్తీనే. ఇదీ జంపింగ్‌ జపాంగ్‌లకు, ప్రధాన పార్టీల గాలం. అసంతృప్తులు, అలక నేతలకు వలవెయ్యడంలో బిజీగా వున్నాయి రాజకీయ పార్టీలు. ఇంతకీ ఎవరెవరు కండువా మార్చారు? ఎవరెవరు మార్చుకోబోతున్నారు?

అతి తక్కువ కాల వ్యవధి, అతిపెద్ద మహాసమరం, గ్రేటర్‌పై జెండా పాతిన పార్టీకే, రాష్ట్రంలోనూ అధికారం సొంతమవుతుందన్న భావన...అందుకే అన్ని ప్రధాన పార్టీలు, బల్దియా సమరాన్ని హోరాహోరీగా మార్చేశాయి. ఇప్పటికే గెలుపు గుర్రాల వేటలో వున్న ప్రధాన పార్టీలు, అందులో భాగంగా వలసలకు గేట్లెత్తేశాయి.

వివిధ పార్టీల్లో అసంతృప్తులపై ప్రధానంగా దృష్టిపెట్టాయి ప్రధాన పక్షాలు. అవకాశాలు రాక, ప్రాధాన్యతలేక, పార్టీలో భవిష్యత్తులేదని రగిలిపోతున్నవారే లక్ష్యంగా గాలమేస్తున్నాయి. మొన్న జూబ్లీహిల్స్‌లో బీజేపీ నేత శ్రీధర్‌‌కు కండువా కప్పింది గులాబీదళం. దీంతో దీనికి కౌంటర్‌గా మరింతమంది గులాబీ నేతలపై దృష్టిపెట్టింది కాషాయం. ఇప్పటికే పలువురు టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఇతర నేతల సమక్షంలో కాషాయంలోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా టీఆర్‌ఎస్‌ అల్లాపూర్‌ డివిజన్‌ సీనియర్‌ నేత పులిగోళ్ల శ్రీనివాస్‌ యాదవ్ కమలం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో ఇంకా భారీగానే చేరికలు ఉంటాయని విశ్వసనీయవర్గాల సమాచారం.

హైదరాబాద్ మాజీ మేయర్, కాంగ్రెస్ నాయకురాలు బండ కార్తీక రెడ్డిని, తమ పార్టీలోకి తీసుకుంది భారతీయ జనతా పార్టీ. ఎన్నాళ్ల నుంచో కార్తీక, పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్నా, సరిగ్గా బల్దియా ఎన్నికల టైంలోనే కండువా కప్పేసింది. గ్రేటర్‌ ఎన్నికల వ్యూహకర్తగా హైదరాబాద్‌లో ల్యాండయిన భూపేందర్‌ యాదవ్‌‌ సమక్షంలో పార్టీ మారారు బండ కార్తీక. ఆమెతో పాటు చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలు కండువా మార్చుకున్నారు. ఇప్పటికే దుబ్బాకలో ఘోరంగా ఓడిన కాంగ్రెస్‌‌కు, కీలకమైన గ్రేటర్‌ ఎన్నికల టైంలో, కార్తీక రూపంలో మరో దెబ్బ తగిలింది. శేరిలింగంపల్లి కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్, భిక్షపతి యాదవ్ కాంగ్రెస్ పార్టీకి, వారి పదవులకు రిజైన్ చేశారు. వీరిరువురిదీ బీజేపీ బాటే. గ్రేటర్‌ ఎన్నికల టైంలో, కాంగ్రెస్‌కు తగులుతున్న వరుస దెబ్బలివి. ఇప్పటికే కొప్పుల నరసింహారెడ్డి బీజేపీలోకి చేరగా, ఫతేనగర్‌ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌ ముద్దాపురం కృష్ణగౌడ్‌దీ అదే దారి అట.

కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్‌ పర్సన్ విజయశాంతి కూడా ఏ క్షణమైనా పార్టీ మారతారన్న ప్రచారం జరుగుతోంది. కేసీఆర్‌‌ సర్కారుపై వరుసగా ట్వీట్లతో హీట్ పెంచుతున్న రాములమ్మ, కమలంలోకి రీఎంట్రీ ఇవ్వడానికి మంచి ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారట. జీహెచ్‌ఎంసీ ఎన్నికల హడావుడే సరైన సమయని కమలం నేతలు కూడా సూచిస్తున్నారట. సరిగ్గా ఇదే టైంలో విజయశాంతి ఘర్‌వాపసీ జరిగితే, పార్టీకి మాంచి ఊపు ఖాయమని బీజేపీ నేతలు లెక్కలేస్తున్నారు.

మరోవైపు ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు చేసిన వ్యాఖ్యలు, ఆసక్తికరంగా మారాయి. దాదాపు పది మంది టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఆయన. గ్రేటర్‌లో రాజకీయ సమీకరణలు శరవేగంగా మారబోతున్నాయని జోస్యం చెప్పారు సోయం. మొత్తానికి గ్రేటర్‌ ఎన్నికల నేపథ్యంలో వలసలు ఊపందుకున్నాయి. ఎవరు ఏ పార్టీలో వుంటారో అర్థంకాని పరిస్థితి ఏర్పడిందని, ఓ మాజీ కార్పొరేటర్‌ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమంటున్నారు విశ్లేషకులు.

Show Full Article
Print Article
Next Story
More Stories