మునుగోడుపై దృష్టి సారించిన ప్రధాన పార్టీలు

Munugodu By - Poll 2022: దూకుడు ప్రదర్శిస్తున్న టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌

Jyothi
Published on: 18 Aug 2022 7:00 AM IST
Political Parties Focus on Munugodu Bypoll 2022
X

మునుగోడుపై దృష్టి సారించిన ప్రధాన పార్టీలు

Munugodu By - Poll 2022: ప్రధాన పార్టీలన్నీ మునుగోడుపై దృష్టి సారించాయి. విజయం సాధించాలని దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. అయితే.. ఉప పోరులో విజయం సాధించాలంటే పోల్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యం. అందుకోసం గ్రామాలను సెట్ చేసే పనిలో పడ్డాయి పార్టీలు. అంతేకాదు.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మాజీ ప్రజాప్రతినిధులను కొంటున్నారని వారు కూడా అమ్ముడుపోతున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు మొదలయ్యాయి.

మునుగోడులో ఏ నోటా విన్న పార్టీల్లో చేరికల అంశం తెరపైకి వస్తుంది. తమ సర్పంచ్ టీఆర్ఎస్‌లో చేరారని.. లేదు బీజేపీలో జాయిన్ అవుతున్నాడని.. కాదు కాంగ్రెస్‌లోనే ఉంటాడని బాహాటంగా చెప్పుకుంటున్నారు ప్రజలు. సీన్ కట్ చేస్తే.. సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు భారీగా నగదు రూపంలో ఇటు టీఆర్ఎస్, బీజేపీలు కాసుల వర్షం కురిపిస్తోందని జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎల్లుండి సీఎం కేసీఆర్ సభ, ఆ మరుసటి రోజే అమిత్ షా సభ ఉండటంతో ఈ వార్తలు గుప్పుమంటున్నాయి.

ప్రస్తుతం మునుగోడులో జరుగుతున్న ప్రచారం ప్రకారం.. చిన్న గ్రామ పంచాయతీ సర్పంచ్ కాస్ట్ పది లక్షలు, పెద్ద గ్రామ పంచాయతీ సర్పంచ్ కాస్ట్ అయితే 15 నుంచి 20 లక్షలు. అడ్వాన్స్‌గా ఐదు లక్షలు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక మిగతా ఐదు లక్షలు. ఇక ఎన్నికలు ముగిసే వరకు ఆ ఊరి బాధ్యతలు సర్పంచ్ మాత్రమే చూసుకునేలా ఒప్పందాలు. అంతేకాదు.. తనతోపాటు మరో సర్పంచ్‌ను పార్టీలోకి తీసుకొస్తే అదనంగా రెండు నుంచి మూడు లక్షలు ఇస్తున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. జెడ్పీటీసీలకు అయితే 50 లక్షల రూపాయల నుంచి కోటి రూపాయల వరకు ఆఫర్ ఇస్తున్నారట.

మొత్తానికి మునుగోడులో ఇప్పుడు సర్పంచ్‌లు, ఎంపీటీసీలకు భలే గిరాకీ వచ్చిందని.. సంతలో మాదిరిగా అమ్ముడుపోతున్నారని సోషల్ మీడియాలో సెటైర్లు మొదలయ్యాయి.

Jyothi

Jyothi

Next Story