దుబ్బాకలో నోట్ల కట్టల కలకలం

Arun Chilukuri
Published on: 27 Oct 2020 8:04 AM IST
దుబ్బాకలో నోట్ల కట్టల కలకలం
X

దుబ్బాకలో టీఆరెస్, బీజేపీ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో నోట్ల కట్టలు కలకలం రేపాయి. పార్టీల ప్రచారాలతో హోరెత్తుతోన్న దుబ్బాకలో సోమవారం పోలీసులు జరిపిన తనిఖీలు మరింత కాక పుట్టించాయి. రాజకీయాన్ని రసవత్తరంగా మార్చాయి.

దుబ్బాకలో హైడ్రామా చోటుచేసుకుంది. బీజేపి అభ్యర్ధి రఘునందన్ రావు మామ ఇంట్లో భారీగా డబ్బు పట్టుబడిందన్న వార్తలతో రాజకీయం ఒక్కసారిగా ఊపందుకుంది. బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు, ఆయన బంధువుల ఇంట్లో 18 లక్షల మొత్తం నగదు పట్టుబడిందని పోలీసులు ప్రకటించారు. డబ్బులు పట్టుబడ్డాయని తెలియగానే బిజెపి కార్యకర్తలు రఘునందన్ ఇంటికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో దుబ్బాక ఒక్కసారిగా రణరంగంగా మారింది.

మరోవైపు బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ దుబ్బాక బయల్దేరగా ఆయన్ను పోలీసులు సిద్ధిపేటలోనే అడ్డుకుని కరీంనగర్ కు పంపించారు. అయితే కరీంనగర్‌ వెళ్లిన బండి సంజయ్‌ అక్కడి పార్టీ ఆఫీస్‌లో దీక్షకు దిగారు. సీపీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ గెలుస్తోందనే భయంతో టీఆర్ఎస్ అరాచకాలకు పాల్పడుతుందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

అయితే బీజేపీ ఆరోపణలను ఖండించారు మంత్రి హరీశ్ రావు. గ్రామాల్లో బీజేపీ ఖాళీ అవుతుందన్న ఫ్రస్ట్రేషన్‌‌తోనే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. డిపాజిట్లు కూడా దక్కవన్న భయంతో నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. సోమవారం జరిగిన హైడ్రామాతో దుబ్బాక రాజకీయం వేడెక్కింది. అయితే ఇలాంటి ఘటనలతో ఆందోళన చెందొద్దని పార్టీ శ్రేణులకు బీజేపీ, టీఆర్ఎస్‌ పార్టీలు పిలుపునిచ్చాయి. ఫోకస్‌ అంతా ప్రచారంపై పెట్టాలన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story