కరోనా భయంతో కొత్త సమస్యలు.. అతి జాగ్రత్తలతో రోగాల బారిన పడుతున్న ప్రజలు

Arun Chilukuri
Published on: 11 Aug 2020 3:08 PM IST
కరోనా భయంతో కొత్త సమస్యలు.. అతి జాగ్రత్తలతో రోగాల బారిన పడుతున్న ప్రజలు
X

జ్వరం వస్తే జనం వణికిపోతున్నారు. దగ్గితే కరోనా అని హడలిపోతున్నారు. తుమ్మితే అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైద్యుల సలహా తీసుకోకుండా సొంత వైద్యంతో లేని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని గుడ్డిగా నమ్మి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు.

నిజామాబాద్ జిల్లాలో గడిచిన మూడు నెలలుగా ప్రజలు కొత్త రోగాలతో ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలు తీసుకుంటున్న అతి జాగ్రత్తలతో తెలియకుండానే వ్యాధిగ్రస్తులుగా మారుతున్నారు. కరోనా భయంతో మోతాదుకు మించి కషాయం తాగడం, ముందు జాగ్రత్త పేరుతో అవసరం లేకున్నా మల్టీ విటమిన్‌ టాబ్లెట్లు విచ్చల విడిగా వినియోగిస్తూ అనారోగ్యం కొని తెచ్చుకుంటున్నారు. ఈ తరహా కేసులు జిల్లాలో ఎక్కువగా నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

సొంత వైద్యం చేసుకొని చాలా మంది ఆసుపత్రులకు వస్తున్నారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా టాబ్లెట్లు వాడితే కిడ్నీ, గుండె జబ్బు వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కషాయం ఎక్కువగా తాగడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్‌ వస్తాయని వైద్యులు చెబుతున్నారు. జిల్లాలో విటమిన్ టాబ్లెట్లు, అజిత్రోమైసిన్, హైడ్రాక్సిల్ క్లోరోక్విన్ మాత్రల వినియోగం పెరిగిపోయినట్లు వైద్యుల పరిశీలనలో తేలింది. ఎలాంటి ప్రిస్కిప్షన్‌ లేకుండా మందులు ఇవ్వకూడదని మెడికల్‌ షాపులకు వైద్యులు సూచించారు. విటమిన్ మాత్రలు అతిగా వాడితే శరీరం సహజత్వం కోల్పోతుందని హెచ్చరిస్తున్నారు. కరోనా భయంతో టెన్షన్‌ పడి కొత్త రోగాలు కొని తెచ్చుకోకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల సలహ పాలించాలని సూచింస్తున్నారు.



Arun Chilukuri

Arun Chilukuri

Next Story