తెలంగాణా విమోచనోద్యమ వీరుల త్యాగాలకు జన ప్రణామం.. పరకాల అమరధామం !

Arun Chilukuri
Published on: 17 Sept 2020 10:54 AM IST
తెలంగాణా విమోచనోద్యమ వీరుల త్యాగాలకు జన ప్రణామం.. పరకాల అమరధామం !
X

సెప్టెంబర్ 17. ఇది తేదీ కాదు. ఒక నినాదం. 4 కోట్ల ప్రజల ఆకాంక్షలకు ఊపిరి పోసిన రోజు. నాడు నిజాం రాజకర్లను అకృత్యాలను తరిమికొట్టిన పౌరుషం. సమైక్య పాలకుల నిర్లక్ష్యపు నీడలను తొలసించిన సందర్భం. పౌరుషాల గడ్డ ఓరుగల్లు కేంద్రంగా తెలంగాణ సాయుధ పోరాటం జరిపిన అమర వీరులను స్మరించుకోవడమే మనమిచ్చుకునే గౌరవం.

అప్పటి నిజాం పాలించిన హైదరాబాద్ సంస్థానంలో మహారాష్ట్ర 3 జిల్లాలు, కర్ణాటక 4 జిల్లాలు, తెలంగాణ 10 జిల్లాలు ఉండేవి. విలీనం జరిగిన దాని వెనుకున్న విముక్తి పోరాటంలో మాత్రం వేలమంది అసువులు బాసారు. నిజాం రజాకార్ల పాలనలో చిన్న పిల్లలు, మహిళలు, పెద్దలు అఘాయిత్యాలకు, అత్యాచారాలకు, అకృత్యాలకు బలైన వారు ఉన్నారు. 1947 ఆగస్టు 15న స్వాతంత్ర్య వచ్చి దేశమంతా సంబరాలు చేసుకుంటుంటే తెలంగాణ ప్రజలు మరో 13 నెలలు బానిస జీవితాలు గడిపారు.

పరకాలలో సెప్టెంబర్ 2న, 1947లో హైదరాబాద్ సంస్థానంను భారత్‌లో విలీనం చేయాలంటూ వస్తున్న గ్రామస్తులపై రజాకార్లు, నిజాం సైనికులు దాడిచేశారు. కత్తులు, బళ్ళాలు, బరిశెలతో మారణకాండ కొనసాగించగా 14 మంది అక్కడికక్కడే అమరులయ్యారు. తర్వాత మరో పదిమంది మరణించారు. 200 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారి త్యాగానికి గుర్తుగా పరకాలలో నిర్మితమైనదే అమరధామం. ఈ అమరధామంలో ఆనాటి యోధుల సజీవ శిల్పాలు, చెట్టుకు కట్టేసి చంపిన తీరు వివరించబడ్డాయి. స్మారక చిహ్నం చుట్టూ జాతీయ జెండా చేతబట్టిన 135 మంది స్త్రీ పురుషుల విగ్రహాలను నిర్మించారు.

నాడు నిజాం రజాకార్ల పాలనలో తెలంగాణ ప్రజలను నరికిన శరీర భాగాలు, అవయవాలు, చిందిన రక్తం, ధారలుగా కారుతున్న రక్తం చూస్తే, పరకాల అమరాధమం ఇప్పుడే జరిగిన సంఘటనగా అనిపించేటట్లు ఉంటుంది. ఇక్కడే కాదు ఉమ్మడి వరంగల్ జిల్లాలో విరా భైరన్ పల్లి, పరకాల అమరధమం ప్రతి తెలంగాణ బిడ్డ తప్పక చూడాల్సిన ప్రదేశం .

ఇప్పటికి పరకాలలో ఎవరిని కదిలించిన నాటి రజాకార్ల అకృత్యాలు కళ్ళ ముందు కదాలడుతున్నాయంటారు స్థానికులు. ఇన్నాళ్లు విమోచనం, విద్రోహం, విలీనం అనే చర్చ సాగుతే ఇప్పుడు మాత్రం అధికారికంగా జరపాలని మరో ఉద్యమం నడుస్తుంది. ఏమైనా పరకాల అమరధమం వద్ద సెప్టెంబర్ 2న అమరవీరులను స్మరిస్తూ వర్ధంతి కార్యక్రమం జరుపుతున్నమని చెబుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేటికి సజీవ సాక్ష్యంగా ఉన్న పరకాల అమరధమం చుస్తే ఆనాటి గుర్తులు కనిపిస్తాయి. కానీ సెప్టెంబర్ 17 అధికారికంగా నిర్వహించకపోవడంతో నిరాశతో ఉన్నామంటున్నారు స్థానికులు. నిజాం రజాకార్ల అకృత్యాలకు సజీవంగా ఉన్న పరకాల అమరధమాన్ని అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్థానికులు కోరుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story