ప్రగతిభవన్‌ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ ప్రయత్నం

NSUI Protest Near Pragati Bhavan : ప్రగతి భవన్ వద్ద బుధవారం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.

Sumitra
Published on: 12 Aug 2020 1:59 PM IST
ప్రగతిభవన్‌ ముట్టడికి ఎన్‌ఎస్‌యూఐ ప్రయత్నం
X

NSUI Protest Near Pragati Bhavan : ప్రగతి భవన్ వద్ద బుధవారం ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఈరోజు ఉదయం ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. హైకోర్టులో పిటీషన్ పెండింగ్‌లో ఉన్నా తెలంగాణ ప్రభుత్వం పరీక్షల షెడ్యూల్ విడుదల చేయడాన్ని సవాల్ చేసారు. ఆయనతో పాటు మరి కొంత మంది ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు కరోనా వైరస్ ను దృష్టిలో పెట్టుకుని పీపీఈ కిట్లు ధరించి పెద్ద సంఖ్యలో ప్రగతిభవన్‌ను ముట్టడించారు. ఈ ముట్టడి కార్యక్రమంలో కార్యకర్తలు మాట్లాడుతూ అన్ని రకాల ప్రవేశ పరీక్షలను వాయిదా వేయాలంటూ డిమాండ్ చేశారు. పోలీసుల కళ్లు గప్పి కార్యకర్తలు క్యాంప్ కార్యాలయానికి తరలివచ్చారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్బంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ మాట్లాడుతూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ పెండింగ్ ఉన్న కూడా ప్రభుత్వం తన నిరంకుశ మొండి వైఖరితో అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న ప్రభుత్వం చెయ్యాల్సిన కరోనా టెస్టుల గురించి పట్టింపు లేని ప్రభుత్వానికి విద్యార్థుల జీవితాలపై కూడా పట్టింపు లేదని మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. నిన్న(మంగళవారం) రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,897 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 09 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 84,544కి చేరింది. మృతుల సంఖ్య 654కి పెరిగింది. సోమవారం ఒక్క రోజే 1,920 మంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కరోనా వైరస్ నుంచి కోలుకోని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 61,294కి చేరింది. ప్రస్తుతం 22,596 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజే 22,972 మంది నమూనాలను పరీక్షించగా 1,897 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 6,65,847కి చేరింది.




Sumitra

Sumitra

Next Story