అమె..ఆ నలుగురు..పక్కా మర్డర్ ప్లాన్..!

Arun Chilukuri
Updated on: 25 Nov 2020 12:41 PM IST
అమె..ఆ నలుగురు..పక్కా మర్డర్ ప్లాన్..!
X

జగిత్యాల జిల్లాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి పవన్‌ సజీవదహనం కేసులో కీలక విషయాలు వెలుగుచూశాయి. భర్తను చంపడంలో భార్య కృష్ణవేణి కీలకంగా వ్యవహరించినట్టు పోలీసులు గుర్తించారు. ఆమెతో పాటు మరో నలుగురు మహిళలను అరెస్ట్ చేశారు. ఐదుగురు మహిళలపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న సజీవదహనం ఘటన ఉమ్మడి కరీంనగర్ జిల్లాని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఈ ఘటనలో తెర వెనుక నిజాలు మరిన్ని ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో హత్యకి ప్లాన్ చేసిన వారితో పాటు హత్య చేసినవారిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

హైదరాబాద్‌కు చెందిన పవన్ ‌కుమార్‌.. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో బావమరిది జగన్‌ను హతమారుస్తానని హెచ్చరించాడు. ఇది జరిగిన కొంత కాలానికి గుండెపోటుతో జగన్‌ మృతి చెందాడు. అయితే జగన్‌ మృతికి పవనే కారణమని పవన్‌ మంత్రాలు చేయడం వల్లే తన భర్త మృతి చెందాడని జగన్‌ భార్య సుమలత భావించింది. తన ఇంటి సభ్యులతో కలిసి పవన్‌ను మట్టు పెట్టేందుకు కుట్ర పన్నింది.

జగన్‌ మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పవన్‌ సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి బల్వంతాపూర్‌కు చేరుకున్నాడు. జగన్‌ చిత్రపటానికి నివాళులర్పించాలని పవన్‌ను ప్లాన్‌ ప్రకారం గది లోపలికి తీసుకెళ్లారు. అనంతరం బయట డోర్‌ లాక్‌ చేశారు. అప్పటికే తెచ్చిపెట్టుకున్న పెట్రోల్‌ను పవన్‌ పై పోసి నిప్పుపెట్టారు. ఈ ఘటనలో పవన్‌ అక్కడికక్కడే సజీవదహనమయ్యాడు.

మంగళవారం ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. తన కొడుకు పవన్ ‌కుమార్‌ను పథకం ప్రకారమే హత్య చేశారని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. పవన్‌ భార్య కృష్ణవేణితో పాటు ఏడుగురు నిందితులను అరెస్ట్ చేశారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story