MLC Kavitha: సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ.. నేడు విచారణకు హాజరు కాలేనని స్పష్టం

MLC Kavitha Letter To CBI
x

MLC Kavitha: సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ.. నేడు విచారణకు హాజరు కాలేనని స్పష్టం

Highlights

MLC Kavitha: 26న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులు

MLC Kavitha: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వేస్టిగేషన్‌కి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇవాళ విచారణకు హాజరు కావడం లేదని ఆమె లేఖ ద్వారా సీబీఐకి తెలిపారు. ముందే నిర్ణయించిన కార్యక్రమాల దృష్ట్యా నేడు విచారణకు హాజరుకావడం సాధ్యం కావడంలేదన్నారు. కాగా, దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది సీబీఐ అధికారులు ఒకసారి కవితను విచారించారు. ఇటీవల ఈ కేసులో కవితను నిందితురాలిగా చేర్చి ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సీబీఐ నోటీసులు పంపింది.

ఈ క్రమంలో ఇవాళ్టి విచారాణకు హాజరుకాలేనని కవిత సీబీఐకి లేఖ రాశారు. ఈ లేఖలో కవిత పలు కీలక అంశాలను ప్రస్తావించారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలి లేదా ఉపసంహరించుకోండని కోరారు. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద నోటీసులు ఇవ్వడం సబబు కాదన్నారు. 2022 డిసెంబరులో అప్పటి దర్యాప్తు అధికారి ఇదే తరహా నోటీసును సెక్షన్ 160 కింద ఇచ్చారని, గతంలో జారీ చేసిన సెక్షన్ 160 నోటీసుకు ప్రస్తుత సెక్షన్ 41ఏ నోటీసు పూర్తి విరుద్ధంగా ఉందని లేఖలో పేర్కొన్నారు. సెక్షన్ 41ఏ కింద ఎందుకు, ఏ పరిస్థితుల్లో నోటీసులు ఇచ్చారో స్పష్టత లేదని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో లిక్కర్ స్కామ్ కేసులో నోటీసులు జారీ చేయడం అనేక ప్రశ్నలకు తావునిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.

అయితే తనకు ఎన్నికల ప్రచార బాధ్యతలు ఉన్నందున ఢిల్లీకి పిలవడం అనేది.. ఎన్నికల ప్రక్రియలో పాల్గొనకుండా అవరోధం కలిగిస్తుందని, ఇది తన ప్రజాస్వామిక, రాజ్యాంగ హక్కులకు భంగం కలిగిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీబీఐ చేస్తున్న ఆరోపణల్లో తన పాత్ర లేదని.. పైగా ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. ఈడీ నోటీసులు జారీ చేయగా తాను సుప్రీం కోర్టును ఆశ్రయించానని తెలిపారు. ఆ కేసు సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని, కేసు విచారణ పూర్తి అయ్యే వరకు ఈ కేసులో దర్యాప్తుకు పిలవబోమని అదనపు సొలిసిటర్ జనరల్ సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశం సీబీఐకి కూడా కూడా వర్తిస్తుందన్నారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో తనకు పార్టీ కొన్ని బాధ్యతలు అప్పగించిందని, రానున్న ఆరు వారాల పాటు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారం, సమావేశాల షెడ్యూల్ ఖరారైందని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో రానున్న 6 వారాల పాటు పార్టీ సమావేశాల్లో పాల్గొంటానని పేర్కొన్నారు. ఎన్ని్కల పనుల్లో బిజీగా ఉండటంతో ఫిబ్రవరి 26వ తేదీన విచారణకు హాజరుకాలేనని స్పష్టంచేశారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో జారీ చేసిన నోటీసులను నిలిపివేతకు పరిశీలించండని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ తన నుంచి సీబీఐకి ఏవైనా ప్రశ్నలకు సమాధానం, సమాచారం కావాలనుకుంటే వర్చువల్ పద్ధతిలో హాజరవ్వడానికి అందుబాటులో ఉంటానని కవిత స్పష్టం చేశారు. దీంతో కవిత సీబీఐ విచారణకు హాజరు అవుతారా లేదా అన్న ఉత్కంఠకు తెరపడింది. కవిత లేఖపై సీబీఐ ఎలాంటి నిర్ణయంపై తీసుకుంటుందోనని సస్పెన్స్ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories