అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పువ్వాడ...

అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి పువ్వాడ...
x
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఫైల్ ఫోటో
Highlights

ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలో జరిగిన ఓ సంఘటనలో అధికారులపై మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, కలెక్టర్ ఆర్.వీ కర్ణన్‌లు ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రి...

ఖమ్మం రూరల్ మండలం తీర్థాలలో జరిగిన ఓ సంఘటనలో అధికారులపై మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, కలెక్టర్ ఆర్.వీ కర్ణన్‌లు ఆగ్రహం వ్యక్తం చేసారు. మంత్రి ఆదేశాలతోనే ఇల్లు కూల్చడానికి వచ్చామన్న అధికారుల వాదనపై మంత్రి నిప్పులు చెరిగారు. తీర్థాలలోని సంగమేశ్వరస్వామి ఆలయ భూముల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించారంటూ అధికారులు శనివారం రోజున వాటిని కూల్చేందుకు యత్నించారు. ఇందులో భాగంగానే శనివారం అంటే ఈ రోజు ఉదయం రెవెన్యూ, పోలీసులు, దేవాదాయ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు అక్కడికి చేరుకున్నారు.

ఈ విషయం ఆనోటా ఈ నోటా గ్రామస్థులందరికీ తెలియడంతో వారంతా అక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుని గుమిగూడారు. అనంతరం ఇండ్లను కూల్చడానికి వచ్చిన అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే అధికారులు ఆ గ్రామ సర్పంచి బాలూనాయక్‌ ఇంటిని కూల్చేందుకు ప్రయత్నం చేయగా సర్పంచి భార్య, ఆమె సోదరుడు రవి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. దీంతో గ్రామస్థులు ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో వారు అధికారులతో గొడవ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య స్వల్ప తోపులాట జరిగింది. దీంతో దేవాదాయ అధికారులు అక్కడి పరిస్థితిని కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌కు ఫోన్‌లో వివరించారు. కలెక్టర్‌ ఆదేశాలతో అధికారులంతా అక్కడినుంచి వెళ్లిపోయారు.

ఇక ఈ గొడవపై స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తాను ఆదేశాలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు ఎలా చెబుతారంటూ అధికారులపై మండిపడ్డారు. ఇటు అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్‌ ఆర్.వీ కర్ణన్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ కమిషనర్‌కు సంబంధిత అధికారులను సరెండర్ చేస్తామని అన్నారు. ప్రొసీజర్ పాటించకుండా అధికారులు వ్యవహరించారని మండిపడ్డారు. శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories