Minister KTR About Lockdown in Telangana: కరోనా నియంత్రణకు లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదు

Minister KTR About Lockdown in Telangana తెలంగాణ ఐటీశాఖ మంత్రి ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు విసిరారు.

Arun Chilukuri
Published on: 9 July 2020 3:00 PM IST
Minister KTR About Lockdown in Telangana: కరోనా నియంత్రణకు లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదు
X
KTR (File Photo)

Minister KTR About Lockdown in Telangana తెలంగాణ ఐటీశాఖ మంత్రి ప్రతిపక్షాలపై విమర్శనాస్త్రాలు విసిరారు. కోవిడ్-19 కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేంత వరకు లాక్ డౌన్ పెడితే ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. లాక్ డౌన్ విధిస్తే కరోనా మరణాల కంటే లాక్ డౌన్ వల్ల సంభవించే మరణాలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేసారు. అందుకే ప్రజలు ఎవరికి వారే జాగ్రత్తలు తీసుకొని నియంత్రణ చేసుకోవాలని సూచించారు. కరోనా వైరస్ నుండి నష్టాలను మాత్రమే కాకుండా ఎన్నో మంచి విషయాలు కూడా మనం నేర్చుకున్నాం అని ఆయన అన్నారు. కరోనా అనేది ఏ ఒక్కరి వల్ల వచ్చింది కాదు...దీనికి లాక్ డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని స్పష్టం చేసారు. పెద్ద పెద్ద దేశాలే కరోనా కేసులు పెరగడం వల్ల కట్టడి చేయలేక చేతులు ఎత్తేశాయని తెలిపారు. ఎవరూ కూడా నాకు కరోనా రాదు... అనే అపోహతో ఉండొద్దు...ఇందుకు ఉదాహరణే డిప్యూటీ స్పీకర్ పద్మారావు అని ఉదహరించారు. నేను ఓ కార్యక్రమానికి ఆయనతో కలిసి హాజరయినపుడు మాస్కు పెట్టుకోమంటే నాకు కరోనా రాదు అన్నారు. కానీ మరుసటి రోజే కరోనా వచ్చిందని తెలిపారు. కరోనా విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫెయిల్ అయ్యారని రాజకీయ విమర్శలు చేయడం దుర్మార్గపు చర్య అని.. ఆ విమర్శలు వారి పైశాచిక ఆనందం కోసం మాత్రమే ఉపయోగపడతాయని విమర్శించారు. ఇలా విమర్శలు చేయడం వల్ల మన కరోనా వారియర్స్ ను నిరుత్సాహ పరిచినట్లే అని స్పష్టం చేసారు.

మేము కూడా కేంద్ర ప్రభుత్వం మీద విమర్శలు చేయొచ్చు...కానీ ఇది సరైన సందర్భం కాదని విమర్శలు చేయడం లేదన్నారు. కరోనా నుండి కోలుకొని రికవరీ అయిన వారి గురించి ఎవ్వరు మాట్లాడరు..ఎక్కడో ఒక లోపం ఉంటే దాని పట్టుకొని గుంజడం సరికాదన్నారు. ప్రభుత్వ తప్పులు కూడా ఎక్కడో ఒక చోట ఉంటాయి..అవి పట్టుకుని భూచీగా చూపడం తప్పు అని సూచించారు. రాష్ట్రంలో కరోనా టెస్టులు సరిగా చేయడం లేదు...ఫలితాలు దాస్తున్నారు అనడం దుర్మార్గపు చర్య అని కొట్టిపారేసారు. ప్రతిపక్షాలు అర్ధరహిత విమర్శలు మానుకోవాలని నా విజ్ఞప్తి అని కోరారు. రాజకీయాలు చేయాలని అనుకుంటే ఇది అసలు సందర్భం కాదు అని ఇలాంటి సమయంలో విమర్శలు చేయడం వల్ల ప్రజలు అయోమయంకు గురి అయ్యే అవకాశం ఉందని స్పష్టం చేసారు. ప్రభుత్వానికి ప్రతిపక్ష పార్టీలు ఎలాంటి సలహాలు,సూచనలు ఇచ్చినా తాము పాటించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

కరోనా వైరస్ అంటే ప్రభుత్వమే ఏదో అంటిస్తుంది అన్నట్లు కొందరు మాట్లాడటం చాలా బాధగా ఉందన్నారు. దయచేసి కరోనా పై పోరాటం చేస్తున్న వైద్యులు,పోలీసులను నిరుత్సాహపరిచే విధంగా విమర్శలు చేయడం మానుకోవాలని కోరారు. దేశంలో తెలంగాణ రాష్ట్రం ఫార్మా రంగంలో ముందంజలో ఉందని తెలిపారు. కరోనా వ్యాక్సిన్ తొందర్లోనే రావాలని కోరుకుంటున్నా..అది కూడా మన తెలంగాణ రాష్ట్రం నుండే దేశానికి అందించాలని ప్రార్థిస్తున్నాం అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భయ భారత్ కేవలం నినాదం తీసుకుంటే సరిపోదు...అది ఒక నినాదంలా తీసుకొని ముందుకు వెళ్ళాలని తెలిపారు. భారత దేశం నుండి నూతన ఆవిష్కరణలు చేసి ప్రపంచానికి స్ఫూర్తిగా నిలవాలని సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story