ఆదిలాబాద్‌లో కాల్పుల కలకలం

Arun Chilukuri
Published on: 18 Dec 2020 8:14 PM IST
ఆదిలాబాద్‌లో కాల్పుల కలకలం
X

ఆదిలాబాద్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఇరువర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ చివరికి కాల్పులకు దారి తీసింది. తన ప్రత్యర్ధులపై ఆదిలాబాద్ మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ ఫరూక్ అహ్మద్ ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ముగ్గురికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. ఒకవైపు తుపాకీతో కాల్పులు జరుపుతూనే మరోవైపు కత్తితోనూ ఫరూక్ దాడి చేశాడు. కాల్పుల్లో గాయపడ్డ ముగ్గురిని ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. అయితే, ఈ ముగ్గురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించినట్లు తెలుస్తోంది.

పాత కక్షలే కాల్పులకు కారణంగా తెలుస్తోంది. కొద్దిరోజుల క్రితం వరకు ఒకే వర్గంగా ఉన్న వీళ్లందరూ రెండు గ్రూపులుగా విడిపోవడంతో గొడవ జరిగిందని అంటున్నారు. క్రికెట్ ఆడుతుండగా పిల్లల మధ్య జరిగిన గొడవే కాల్పులకు కారణమని స్థానికులు చెబుతున్నారు. అయితే, రాజకీయ కారణాలు, పాత కక్షలే అసలు కారణమంటున్నారు. కాల్పులకు ముందు రెండు వర్గాలు నడిరోడ్డుపై వీరంగం ఆడారు. ఒకరినొకరు తీవ్రస్థాయిలో కొట్టుకున్నారు. బండరాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ క్రమంలోనే ఫరూక్ అహ్మద్ కాల్పులు జరిపాడు. ఒక చేత్తో గన్‌తో మరో చేత్తో కత్తితో ప్రత్యర్ధులపై దాడికి దిగాడు. దాంతో, అక్కడ పరిస్థితి రణరంగంగా మారింది.

క్రికెట్ ఆడుతుండగా పిల్లల మధ్య జరిగిన గొడవే కాల్పులకు కారణమని ఐజీ నాగిరెడ్డి తెలిపారు. కాల్పులు జరిపిన ఫరూక్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయన్న ఐజీ నాగిరెడ్డి క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఫరూక్ అహ్మద్ ఉపయోగించిన గన్ లైసెన్సెడ్ రివాల్వర్ అని ఐజీ నాగిరెడ్డి వెల్లడించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story