KTR: రైతుబంధు ఎగ్గొట్టి.. రాహుల్ బంధు ఇస్తున్నారు!

KTR: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Arun Chilukuri
Published on: 9 March 2026 5:09 PM IST
KTR:  రైతుబంధు ఎగ్గొట్టి.. రాహుల్ బంధు ఇస్తున్నారు!
X

KTR: రైతుబంధు ఎగ్గొట్టి.. రాహుల్ బంధు ఇస్తున్నారు!

KTR Fires on CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో రైతులకు అందాల్సిన 'రైతుబంధు'ను నిలిపివేసి, ఢిల్లీలోని గాంధీ కుటుంబం కోసం 'రాహుల్ బంధు' పథకాన్ని అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సిరిసిల్లలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.

పదవి కోసం రూ. 1000 కోట్లా?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడం కోసమే 'రాహుల్ బంధు' పేరుతో ఏటా వెయ్యి కోట్ల రూపాయలను గాంధీ కుటుంబానికి సమర్పిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. "కేసీఆర్ హయాంలో డిసెంబర్ నెల రాగానే రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమయ్యేవి. కానీ ఇప్పుడు కోతల సమయం వచ్చినా కాంగ్రెస్ సర్కార్ పైసా విదల్చలేదు. రేవంత్ రెడ్డి ఇప్పటికే మూడుసార్లు రైతుబంధును ఎగ్గొట్టి రైతులను వంచించారు" అని మండిపడ్డారు.

రుణమాఫీపై రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్

ఇటీవల రుణమాఫీ, రైతుబంధుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుబట్టారు. "నేను రుణమాఫీ చేశానని అనుకుంటున్నా.. రైతుబంధు వేశానని అనుకుంటున్నా అని సీఎం అనడం విడ్డూరంగా ఉంది. అసలు మీరు ముఖ్యమంత్రేనా? నిధులు విడుదల చేస్తే మీకు తెలియకుండా ఉంటుందా?" అని నిలదీశారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడే రేవంత్ రెడ్డి సీఎంగా ఉండటానికి అనర్హుడని ధ్వజమెత్తారు.

హైదరాబాద్‌లో పాలన అస్తవ్యస్తం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కనీస సౌకర్యాలు కరువయ్యాయని కేటీఆర్ విమర్శించారు. నగరంలో దోమలు విపరీతంగా పెరిగిపోయాయని, చెత్త సేకరణ కూడా సరిగ్గా జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ముందే చెప్పారని, ఆలోచించి ఓటు వేయకపోతే ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతాయని ప్రజలకు గుర్తుచేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story